డివిజన్ కేంద్రంగా ఎటపాక


నెల్లిపాక: ఎటపాకను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ (రాజపత్రం)ను విడుదల చేసింది. ఈమేరకు శుక్రవారం నాలుగు విలీన మండలాల తహశీల్దార్లకు సమాచారం అందింది. ప్రభుత్వ ప్రతిపాదనైపై 30 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలను,సూచనలను తెలపాలని  పేర్కొన్నారు. కాగా విలీన మండలాలను రంపచోడవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి తెస్తూ ఏడు నెలల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు వాటిని 1974 ఆంధ్రప్రదేశ్ జిల్లాల రూపకల్పన చట్టంలోని 3వ విభాగం కింద రంపచోడవరం డివిజన్ నుంచి చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, నెల్లిపాక మండలాలను తొలగించి  వాటిని ఎటపాక రెవిన్యూ డివిజన్ పరిధిలోకి చేర్చుతున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. ఇక్కడే అన్ని డివిజన్, మండల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

 ఇక మండలం కూడా ఎటపాకే

 ఏపీలో విలీనం చేసిన భద్రాచలం రూరల్ మండలాన్ని నెల్లిపాక మండల కేంద్రంగా చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగానే కాక రెవెన్యూ మండలంగా మార్చుతున్నట్లు కూడా ఇపుడు గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఇక నెల్లిపాక మండలంకు బదులుగా  ఎటపాక మండలంగా గుర్తించనున్నారు. ఎటపాకలో అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top