రబీసాగును నీటి ఎద్దడి పీడిస్తున్న వేళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ
అమలాపురం : రబీసాగును నీటి ఎద్దడి పీడిస్తున్న వేళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. జిల్లాలో గోదావరి డెల్టా, ఏలేరు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. తగినంత నీరు లేకున్నా మొత్తం ఆయకట్టులో సాగుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో శివార్లలో నీటి కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అమలాపురం, పిఠాపురం, కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా చినుకులు పడడం రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది.
సంక్రాంతి తరువాత ఎండ తీవ్రత పెరుగుతున్నందునచేలలోని నీటిలో కొంత ఆవిరి రూపంలో పోతే ఈ ఎద్దడి సమయంలో మరింత ఇబ్బందని కలవరపడుతున్న సమయంలో వాతావరణం మేఘావృతం కావడం కొంత ఊరటనిచ్చింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడితే కనీసం పదిపదిహేను రోజుల పాటు సాగునీటి కోసం ఎదురుతెన్నులు చూడాల్సిన పని లేదని డెల్టా, ఏలేరు ఆయకట్ల రైతులు ఆశిస్తున్నారు.