రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పదేళ్లు దాటినా నేటికి సరైన వసతులు సమకూరలేదు.
కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పదేళ్లు దాటినా నేటికి సరైన వసతులు సమకూరలేదు. దీంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు చెట్ల కింద, ఆరుబయట, గోడ పంచల కింద మధ్యాహ్న భోజనాన్ని వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత కింద 1150 వ ంట గదులు మంజూరు కాగా ఇందులో 912 గదుల పనులు ప్రారంభించారు. ఇందులో 676 నిర్మాణం పూర్తి గాకా ఇంకా 236కు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండవ విడత కింద 637 వంట గదులు మంజూరు కాగా ఇందులో 274 పనులను ప్రారంభించారు. ఇందులో 84 వంట గదుల పనులు పూర్తి కాగా మిగతా 190 గదుల పనులు వివిధ ధశల్లో ఉన్నాయి.
పనులు ఎప్పటికి పూర్తయ్యేనో:
మెదటి, రెండవ విడత కింద మంజూరైన వంట గదుల పనులు పూర్తి కాలేదు. ఇందులో రెండు విడతలకు సంబంధించి 426 వంట గదుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొంత మంది నిధులు తక్కవని అసలు పనులను మొదలే పెట్టలేదు. మొదటి విడత కింద మంజూరైన వంట గదులకు ఒకొక్క వంట గదికి రూ. 75 వేలు రాగా రెండవ విడత కింద మంజూరైన వాటికి ఒకొక్క దానికి 1.50 లక్షలు మంజూరయ్యాయి. అయినా కొన్ని చోట్ల నిధులు సరిపడవని పనులను ప్రారంభించలేదు.
గాలిలో దీపంలా:
ఆరుబయట వంటలు చేయటం వల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఏదైనా పొరపాటు జరిగితే విద్యార్థుల జీవితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుంది. జిల్లా వ్యాప్తంగా 6498 వంట ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజనానికి వసతులను ఏర్పాటు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.