Telangana Govt Increases Wages Of Midday Meal Scheme Workers, Will Get Pay Rise From July - Sakshi
Sakshi News home page

Lunch Workers Wages Hike In TS: మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు ఈనెల నుంచే..

Jul 16 2023 1:50 AM | Updated on Jul 16 2023 12:20 PM

Wage hike for lunch workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈనెల నుంచి ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్‌–కమ్‌ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. శనివారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యాసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్‌ లెవెల్‌ అచీవ్‌ మెంట్‌ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. 

పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం.... 
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్‌.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement