అయ్యా.. నేను సదివి బాగుపడతా | Nizamabad Tribal Girl ready to die for education | Sakshi
Sakshi News home page

అయ్యా.. నేను సదివి బాగుపడతా

Jan 31 2014 3:16 PM | Updated on Sep 2 2017 3:13 AM

అయ్యా.. నేను సదివి బాగుపడతా

అయ్యా.. నేను సదివి బాగుపడతా

‘నాన్నా...నన్ను బడికెందుకు పంపవు...పంపకపోతే చచ్చిపోతా’అంటూ ఓ గిరిజన బాలిక పంతం పట్టి అనుకున్నది సాధించింది.

నాగిరెడ్డిపేట: ‘నాన్నా...నన్ను బడికెందుకు పంపవు...పంపకపోతే చచ్చిపోతా’అంటూ ఓ గిరిజన బాలిక పంతం పట్టి అనుకున్నది సాధించింది. వివరాలివీ... నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం పంచాయతీ పల్లెబొగడ తండాలో గురువారం జాతీయ బాల కార్మిక చట్టం పథకం సంచాలకుడు సుధాకర్, ఎంఈవో గోవర్దన్‌రెడ్డి కలిసి బడి బయట పిల్లలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి నిర్మల అనే బాలిక తారసపడింది.

తల్లిదండ్రులు ఆమెను గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదివించి ఆరునెలల క్రితం మాన్పించిన విషయం తెలుసుకున్నారు. అధికారులు నిర్మల తల్లితో మాట్లాడి కూతురును బడికి పంపేందుకు ఒప్పించారు. అయితే, ఆమె తండ్రి దేవుజా గ్రామంలో లేకపోవటంతో ఫోన్‌లో సంప్రదించారు. అతడు మాత్రం కూతురును బడికి పంపడానికి అంగీకరించలేదు. జైలుకు పంపుతామని హెచ్చరించినా లెక్క చేయలేదు.

ఈ సంభాషణంతా వింటూ అక్కడే ఉన్న నిర్మల పీడీ  చేతిలో నుంచి ఫోన్ తీసుకొని తండ్రితో మాట్లాడింది. తనను ఎందుకు బడికి పంపవని నిలదీసింది. బడికి పంపకపోతే చచ్చిపోతానని బెదిరించింది. కంగుతిన్న దేవుజా చివరికి కూతురును బడికి పంపేందుకు అంగీకరించాడు. అనంతరం బాలికను పీడీ సుధాకర్, ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డితో కలిసి తండాలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement