నియోజకవర్గంలో కలకలం రేపిన నకిలీ పాస్పుస్తకాల కేసు విచారణకు ఇప్పుడు అధికార పార్టీ నేతలు ప్రతిబంధకంగా మారుతున్నారు.
వినుకొండ : నియోజకవర్గంలో కలకలం రేపిన నకిలీ పాస్పుస్తకాల కేసు విచారణకు ఇప్పుడు అధికార పార్టీ నేతలు ప్రతిబంధకంగా మారుతున్నారు. పట్టాదారు పాస్పుస్తకాలే గాకుండా... వివిధరకాల సర్టిఫికెట్లను సైతం అచ్చుగుద్దినట్టు ఇచ్చే నకిలీ సూత్రధారి ముండ్రు సీతారామాంజనేయులును గంటల వ్యవధిలోనే చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఆయన ఇస్తున్న సమాచారంతో పలు మండలాలకు చెందిన వీఆర్వోలు బెంబేలెత్తుతున్నట్టు తెలుస్తోంది.
సుమారు 40 మంది పాత, ప్రస్తుత వీఆర్వోలతో పాటు అనేక మంది దళారులకు నకిలీ పాస్ పుస్తకాల తయారీతో సంబంధాలున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. శావల్యాపురం మండలం కారుమంచి సొసైటీలో రైతుల పేరుతో వారికి తెలియకుండానే రుణాలు తీసుకుని స్వాహా చేసిన విషయూన్ని గమనించిన పలు బ్యాంకు అధికారులు కూడా నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల పరిశీలనపై దృష్టి సారించారు. ప్రతి బ్యాంకులోనూ కుప్పలు, తెప్పలుగా ఫేక్ పాస్పుస్తకాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
తొలిరోజు పోలీసులు పలువురు వీఆర్వోలను అదుపులోకి తీసుకోవడంతో వారితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. వారిని కాపాడేందుకు పడరాని పాట్లు పడ్డారు. నకిలీ పాస్ పుస్తకాల తయారీదారులతో పాటు దళారీలు, పలు గ్రామాల్లో ఉన్న టీడీపీ ద్వితీయశ్రేణి నాయకుల పేర్లు అధికంగా వెలుగులోకి వస్తుండటంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక గుంటూరులో ఉన్న తమ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులును కలిసి పరిస్థితి వివరించి ఆయనపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు పోలీసుల విచారణ ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చంద ంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏదేమైనా ముగ్గురు వీఆర్వోలను అదుపులోకి తీసుకోవడంతోనే విచారణ ఆగిపోయిందని అంటున్నారు. రైతు రుణమాఫీలో రైతుల పేరుతో రుణాలు కాజేసిన నకిలీల గుట్టును రట్టుచేస్తామని, వారిపై సీబీఐ విచారణ చేయిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినప్పటికీ ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నారుు. పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల తయారీకి చిరునామాగా మారిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అనంతరం విచారణ మందగించిందనే విమర్శలు వస్తున్నాయి. విచారణకోసం జిల్లా ఎస్పీ రామకృష్ణ, క్రైమ్ డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావును ప్రత్యేక అధికారిగా నియమించారు. కారుమంచి సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలతో ప్రారంభమైన వ్యవహారం నకిలీ పట్టాదారు పుస్తకాల తయారీలో తెలుగు తమ్ముళ్ళకు కూడా అధిక సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి చర్యలు ఏ మేరకు చేపడతారో వేచి చూడాల్సిందే.