చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.
గుంటూరు (చిలకలూరిపేట) : చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. బావిలో పడిన కూతురిని కాపాడబోయి తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన కొంగబోయిన నాగమణి(30) పొలంలో కలుపు తీయడానికి బయలుదేరుతూ ఆరేళ్ల కూతుర్ని కూడా వెంట తీసుకెళ్లింది. తల్లి పొలంలో కలుపు తీస్తుండగా ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్నారి దగ్గరలో ఉన్న ఊట బావి దగ్గరకెళ్లింది.
ప్రమాదవశాత్తూ బావిలో పడిపోవడంతో చిన్నారి కేకలు వేసింది. కేకలు విన్న తల్లి నాగమణి కూతురిని కాపాడాలనే ప్రయత్నంలో ఏమీ ఆలోచించకుండా బావిలో దూకేసింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకూతుళ్ల శవాలు బావిలో నుంచి తీయడానికి ప్రయత్నిస్తున్నారు.