
రుణమాఫీ కోసం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి
రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెబుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై డ్వాక్రా మహిళలు తిరగబడ్డారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఇంటి వద్ద డ్వాక్రా మహిళల ఆందోళన
కాకినాడ: రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెబుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై డ్వాక్రా మహిళలు తిరగబడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీడీపీ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... కాకినాడలో బుధవారం దాదాపు 200 మంది డ్వాక్రా సంఘాల మహిళలు స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించారు. ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే ఇంటింటికీ వచ్చి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పడంతో ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు.
రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితేగానీ డొక్కాడని తాము రుణాలు రద్దయితే ఆర్థికంగా చేయూత లభిస్తుందనే నమ్మకంతో అధికారం కట్టబెట్టామని, సీఎం చంద్రబాబుఆ మాటే మరిచారని చెప్పారు. ఇప్పుడు రుణాలు ఎవరు చెల్లిస్తారని గట్టిగా ప్రశ్నించారు. ‘‘మీరు రుణ మాఫీ చేయకపోవటం వల్ల తీసుకున్న రుణానికి 13 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోంది. లక్ష రూపాయల అప్పున్న గ్రూపు అదనంగా 13 వేలు కట్టాల్సి వస్తోంది. ఈ వడ్డీ ఇంకా పెరుగుతుంది. దీన్నెవరు కడతారు?’’ అని వారు ప్రశ్నించారు. కొందరి సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును రుణాల కింద జమ చేసుకుంటున్నారన్నారు. టీడీపీ మోసంతో తమ కష్టార్జితాన్ని కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేఇంట్లో లేకపోవడంతో ఆయన సోదరుడు సత్యనారాయణ వారిని సముదాయించి పంపారు.