ఓ ప్రైవేట్ వైద్య కళాశాల ఆస్పత్రిలో పుట్టిన కొద్దిసేపటికే ఓ శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
మొయినాబాద్, న్యూస్లైన్: ఓ ప్రైవేట్ వైద్య కళాశాల ఆస్పత్రిలో పుట్టిన కొద్దిసేపటికే ఓ శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఆదివారం మండల పరిధిలోని అమ్డాపూర్ చౌరస్తాలో ఉన్న భాస్కర వైద్య కళాశాల ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన అవుసుల లావణ్య(25) గర్భం దాల్చినప్పటి నుంచి భాస్కర ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. ఈనెల 27న కుటుంబీకులు ప్రసవం కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం ఉదయం ఆమెకు నొప్పులు వచ్చాయి. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవమే అవుతుందన్నారు. మధ్యాహ్నం వరకు ప్రసవం కాకపోవడంతో ఆపరేషన్ చేయాలని కుటుంబసభ్యులు వైద్యులను కోరారు.
కచ్చితంగా సాధారణ ప్రసవమే జరుగుతుందని వైద్యులు చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. శనివారం అర్ధరాత్రి మగశిశువు జన్మించాడని, ప్రసవం జరిగిన కొద్దిసేపటికే మృతిచెందాడని వైద్యులు లావణ్య కుటుంబీకులకు చెప్పారు. అదేరాత్రి మృతశిశువును బంధువులకు అప్పగించి ఆస్పత్రి బయటకు పంపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతిచెందాడని ఆరోపిస్తూ ఆదివారం లావణ్య కుటుం బీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ రాంచందర్రావు మాట్లాడుతూ.. ప్రసవ సమయం మించిపోవడంతోనే శిశువు మృతి చెంది ఉండొచ్చన్నారు. దీంట్లో వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు. ఈనెల 24న లావణ్యకు ప్రసవం జరగాల్సి ఉండగా కుటుంబీకులు 27 తేదీన ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. సహృదయంతో తాము ఆస్పత్రిలో చేర్చుకున్నామని, కుటుంబీకుల ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.