మంచి మనిషి మేదరమెట్ల


నెల్లూరు: దివంగత మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి మంచిమనిషిగా అందరి మనుసుల్లో నిలిచారని  ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొనియాడారు. గురువారం జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాకలో మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి సంతాప సభ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పట్టుదల, ఉదార స్వభావం గల వ్యక్తి మేదరమెట్ల అని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ఓదార్పుయాత్రకు వచ్చిన సమయంలో బ్రాహ్మణక్రాకలోని మేదరమెట్ల నివాసంలో మూడు రోజుల పాటు బస చేశారన్నారు. జగన్‌తోకూడా మేదరమెట్లకు సానిహిత్యం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు. జెడ్పీ ఎన్నికలో కూడా తమ వెంటే ఉండి చైర్మన్‌గా బొమ్మిరెడ్డి ఎంపికయ్యేందుకు దోహదపడ్డారన్నారు. మండల ప్రజలందరి మనుసులలో ఉదార స్వభావుడిగా పేరుతెచ్చుకున్నారని తెలిపారు.




 ప్రజా సేవకే అంకితమైన మేదరమెట్ల: కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

 వెంకటకృష్ణారెడ్డి నిరంతరం ప్రజాసేవకే అంకితమయ్యారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కావలి కాలువకు నీరు వచ్చేందుకు ఎప్పుడు తపన పడేవారని తరచూ దీనిగురించి తనతో పోన్‌లో మాట్లాడేవారన్నారు. ఆయన ఆశయం కావలి కాలువను ఆధునీకరించడమేనన్నారు. ఇప్పుడు ఉన్న 500 క్యూసెక్కులకు బదులు 1200 క్యూసెక్కులు వచ్చేలా కృషిచేసి మేదరమెట్ల ఆశయాన్ని నెరవేరుద్దామన్నారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో మరణవార్త విని దిగ్బాంత్రికి లోనయ్యానని అన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.




 మామా అనే పిలుపునకు దూరమయ్యా: మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి

 మేదరమెట్ల మృతితో మామా అనే పిలుపునకు దూరమయ్యానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అడిగిన వారికి లేదనకుండా దానాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. అనుకున్న దానికోసం తపన పడి దానిని సాధించే వరకు నిద్రపోయేవాడు కాదన్నారు. కావలి కాలువ మీదకు సాగునీటికోసం తనను ఎన్నోసార్లు పట్టుబట్టి తీసుకొచ్చాడని అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని బ్రాహ్మణక్రాకలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.




 ఎనిమిది నెలల్లోనే ఎంతో స్నేహితుడయ్యాడు:  జెడ్పీ ైచె ర్మన్ బొమ్మిరెడ్డి

 ఎనిమిది నెలల పరిచయంతోనే మేదరమెట్ల తనకు ఎంతో దగ్గరై మంచి స్నేహితుడయ్యారని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆయన సతీమణి శివలీల జలదంకి జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వచ్చానని, అప్పటినుంచి ఇప్పటికి స్నేహితులుగా ఉన్నామన్నారు. తాను చైర్మన్‌గా గెలిచేందుకు ఎంతో సహకరించారన్నారు. జలదంకి మండలానికి ఇంతవరకు ఎంపీడీఓ కార్యాలయం లేదని తన దృష్టికి పలుమార్లు తెచ్చి దానిని మంజూరు చేయాలని మేదరమెట్ల కోరారన్నారు. ఆయన కోరిక ప్రకారం త్వరలోనే కార్యాలయంను ఏర్పా టు చేస్తామన్నారు. ఆయన భార్య శివలీల కు మద్దతు ఉంటుందని తెలిపారు.




 52 ఏళ్ల అనుబంధం మాది:   మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి

 మేదరమెట్లకు తనకు 52 ఏళ్ల అనుబంధం ఉందని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా భాదగా ఉందన్నారు. చదువుకునేటప్పటి నుంచి వ్యాపారం, రాజకీయాల్లో తనకు ఎంతో గౌరవం ఇచ్చేవారన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో కృషి చేశారన్నారు. జలదంకి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, సాగునీటికోసం పోరాడారని కొని యాడారు. ముందుగా వారంతా  వెంకట కృష్ణారెడ్డి సమాధివద్ద నివాళులర్పించిన అనంతరం సంతాప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ని వాళులర్పించి మౌనం పాటించారు. మేదరమెట్లపై ఆయన మరదలి కుమారుడు వంటేరు రామచంద్రారెడ్డి తయారు చేసిన మనసున్న మారాజు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రా ష్ట్ర నాయకులు కందుకూరి వెంకటసత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top