'ఓపెన్‌' చిట్టీలతో చిక్కులు

Mass Copying In Open School Exams - Sakshi

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో చిట్టీలు వేస్తూ పట్టుబడిన టీచర్‌

అతనిపై చర్యలకు అబ్జర్వర్‌ సిఫారసు

కర్నూలు సిటీ:  ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర పరీక్షలను చిట్టీల వ్యవహారం అధికమైంది. ఇందులో చాలా కొందరు ఉపాధ్యాయుల ప్రమేయం ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు సంబంధించి నాలుగు డివిజన్లలో 29 కేంద్రాల్లో ఈ నెల 30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.  పదవ తరగతి పరీక్షలకు 3005 మంది, ఇంటర్‌ పరీక్షలకు 3213 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.  పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లా అబ్జర్వర్‌గా ప్రభుత్వ బీఎడ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాఘవరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ ఎలా ఉన్నా ఆదోని, డోన్‌ డివిజన్లలోని కేంద్రాల్లో కొందరు ఉపాధ్యాయులే పరీక్షలు రాసే వారి నుంచి డబ్బులు వసూలు చేసి పాస్‌కు గ్యారంటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇందుకోసం సదరు ఉపాధ్యాయులు చిట్టీల వ్యవహారానికి తెరలేపినట్లు ఆరోపణలున్నాయి.  డోన్‌ డివిజన్‌లోని ఓ బాలికోన్నత పాఠశాలలో ఈ నెల 24న పరీక్ష కేంద్రంలో ఓ టీచర్‌ తాను ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న గదిలో కాకుండా పక్క గదిలో విద్యార్థికి చిట్టీలు ఇస్తూ సిట్టింగ్‌ స్క్వాడ్‌కు పట్టుబడ్డారు. జిల్లా అబ్జర్వర్‌  విచారించి సదరు టీచర్‌పై చర్యల నిమిత్తం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి డీఈఓ తాహెరా సుల్తానాను వివరణ కోరగా  మంగళవారం డోన్‌ హైస్కూల్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇన్విజిలేటర్‌ను తప్పించామన్నారు. డిప్యూటీ  ఈఓతో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top