
సర్కారు బడికి రాం..రాం..
సర్కారు పాఠశాలల్లో బడి ఈడు పిల్లలను చేర్చాలన్న సంకల్పం నెరవేరడం లేదు.
► మూడొంతుల మంది కాన్వెంట్లు, ప్రైవేటు స్కూళ్ల వైపే మొగ్గు ..
► ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలకు స్పందన అంతంతమాత్రమే
► పిల్లల వేటకు ముందుగానే ముగింపు
సాక్షి, విశాఖపట్నం : సర్కారు పాఠశాలల్లో బడి ఈడు పిల్లలను చేర్చాలన్న సంకల్పం నెరవేరడం లేదు. ఊరూవాడా కాన్వెంట్లు, ప్రైవేటు స్కూళ్లు ఏర్పాటవడం... ప్రభుత్వ స్కూళ్లలో అరకొర టీచర్లు, బొటాబొటీ చదువులు, చాలీచాలని సదుపాయాలు వెరసి సర్కారు బడుల్లో విద్యార్థులు చేరే పరిస్థితి కనిపించడం లేదు. పైగా ఏటేటా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య క్షీణించిపోతోంది. దీంతో ఏటా వేసవి సెలవులు ఆరంభం కాగానే ప్రభుత్వం 6–14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి ఏవేవో పేర్లు పెట్టి ఆ బాధ్యతను సంబంధిత ఉపాధ్యాయులకు అప్పగిస్తోంది.
ఈ ఏడాది వేసవి సెలవుల్లో అమ్మ ఒడి–మన బడి, మన ఊరు–మన బడి పేరిట బడి ఈడు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. మార్చి 15 నుంచి 23 వరకు అమ్మ ఒడి–మనబడి, మార్చి 23 నుంచి 30 వరకు మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వం మన ఊరు–మన బడిని తొలుత ఏప్రిల్ 8 వరకు కొనసాగించాలని నిర్ణయించినా మండుటెండలు, వడగాడ్పుల దృష్ట్యా ఆదివారంతో ముగించింది.
ఈ రెండు కార్యక్రమాలను నెత్తినేసుకున్న ఆయా పాఠశాలల టీచర్లు రోజూ తాము పనిచేస్తున్న గ్రామాల్లో బడి ఈడు పిల్లల కోసం తిరుగుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండల్లో 1–5 తరగతుల్లో చేరే వారి కోసం ఇంటింటికి వేట సాగిస్తున్నారు. కానీ వీరికి కనిపించిన పిల్లల్లో మూడొంతులు కాన్వెంట్లలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ‘మీ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చండి’ అంటూ టీచర్లు ఆ పిల్లల తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నారు. అయినప్పటికీ ఏ కొద్దిమందో వీరి అభ్యర్థనను మన్నిస్తున్నారు.
కూలీ నాలీ చేసుకునే వారు కూడా తమ బిడ్డల్ని కాన్వెంట్లలో చేర్చడానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మరీ స్తోమత లేని వారే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. దీంతో టీచర్లు ఆశించిన మేర బడి ఈడు పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరడం లేదు. ఏటా తాము ఈ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం కోసం పాట్లు పడుతున్నామని, కానీ ఏటికేడాది చేరడానికి మందుకొచ్చే వారి సంఖ్య తగ్గిపోతుండడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల సంఖ్య తగ్గిపోతే హేతుబద్ధీకరణ పేరిట ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేస్తారని, క్రమేపీ ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తారని వీరు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది లక్ష్యం 57 వేలు
ఈ విద్యా సంవత్సరంలో జిల్లా, నగర వ్యాప్తంగా 57 వేల మంది బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మ ఒడి–మనబడి, మన ఊరు–మనబడి కార్యక్రమాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించింది. అమ్మ ఒడిలో 9400 మందిని, మన బడి కార్యక్రమంలో 8300 మంది చిన్నారులను గుర్తించి.. వారు సర్కారు స్కూళ్లలో చేరడానికి అడ్మిషన్ కార్డులు అందజేశారు.
వీరితో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న మరో 30 వేల మంది పిల్లలు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నట్టు గుర్తించామని ఇన్చార్జి జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి ‘సాక్షి’కి చెప్పారు. ఈ విద్యా సంవత్సరం ఆరంభం నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. వేసవి తీవ్రత, వడగాడ్పులను దృష్టిలో ఉంచుకుని మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని వారం రోజులు ముందుగా ఆదివారంతో ముగించినట్టు తెలిపారు.