సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో పడవ ప్రమాదానికి ముందు చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాతో వైరల్ అయింది. 21 మందిని బలితీసుకున్న బోటును నిలిపివేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖకు ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రయత్నించగా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా ఉంది. అంతేకాదు పైస్థాయి అధికారులు తమకు అండగా ఉన్నారని నిర్వాహకులు సదరు ఉద్యోగిని బెదిరించారు. పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేసినా వినలేదు. బోటుకు అనుమతి కూడా తీసుకోలేదని చెప్పినా పట్టించుకోలేదు.
మీరేం చేసినా లెక్కచేయబోమన్నట్టుగా బోటు నిర్వాహకులు వ్యవహరించారు. పడవకు పర్మిషన్ తీసుకోకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని మహా విషాదానికి కారణమయ్యారు. కాసుల కక్కుర్తితో 21 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల అండదండలతో ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనడానికి తాజా ఘటనే ప్రత్యక్ష రుజువు.


