వడివడిగా శ్రీశైలంలోకి కృష్ణమ్మ

Krishna flood water flow into the Srisailam reservoir was increased - Sakshi

1.03 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

52.06 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి కొనసాగుతున్న నీటి విడుదల

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయంలోకి కృష్ణా వరద ప్రవాహం మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం జలాశయంలోకి 1,03,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 52.06 టీఎంసీలకు చేరుకుంది. గురువారం పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదిలో వరద పెరిగి శ్రీశైలం జలాశయంలోకి ఉధృతి కొనసాగుతుందని అధికారవర్గాలు తెలిపాయి.

► ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి 45 వేల క్యూసెక్కులు చొప్పున దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి 79 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి వచ్చే జలాలకు తుంగభద్ర, హంద్రీ నుంచి వచ్చే వరద ప్రవాహం తోడవుతోంది. 
► సాగర్‌కు దిగువన వరదతో పులిచింతల ప్రాజెక్టులోకి 6,066 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 4,014 క్యూసెక్కులు వదిలి.. 13,395 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
► గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 68,115 క్యూసెక్కులు చేరుతుండగా..  67,615 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top