భన్వర్‌లాల్‌ భయపడలేదు

IYR krisharao letter to EC over Bhanwar lal issue - Sakshi

మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనల ప్రకారం నడుచుకోవడంతో రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏ.కే.జ్యోతికి బుధ వారం ఆయన లేఖ రాశారు.

సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల అధికారులుగా నియమితులైన వారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకుంటే ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో వివరించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుగుణంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌పై మూసివేసిన కేసులను తిరగదోడి వేధిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులపై వేధింపులకు తానే సాక్షినన్నారు. 

ప్రభుత్వ దమననీతికి నిదర్శనం
2014 ఎన్నికలప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో భన్వర్‌లాల్‌కు పదోన్నతి కల్పించకుండా అదే బ్యాచ్‌కు చెందిన ఇతరులకు ఇచ్చారని తెలిపారు. సాధారణంగా ప్రమోషన్లకు కేసులు అడ్డంకిగా ఉన్నప్పుడు ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. ప్రభుత్వం తనపై కేసును మూసివేయకుండా చాలా ఏళ్లు పక్కన పెట్టినప్పటికీ భన్వర్‌లాల్‌ భయపడలేదన్నారు.

తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కేసును ఒక కొలిక్కి తేవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. ఆ తర్వాత కేసును మూసివేసి భన్వర్‌లాల్‌కు ప్రమోషన్‌ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పదవీ విరమణ రోజున తిరగదోడటం దమననీతికి అద్ధం పడుతోందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top