జ్యుయెలరీ షాపులో బ్యాగుల్లో ఉంచిన వెండి వస్తువులు, నగదును చోరులు చాక చక్యంగా కొట్టేశారు.
జ్యుయెలరీ షాపులో భారీ చోరీ
Jan 23 2016 9:25 AM | Updated on Aug 30 2018 5:27 PM
రాజమహేంద్రవరం క్రైమ్ : జ్యుయెలరీ షాపులో బ్యాగుల్లో ఉంచిన వెండి వస్తువులు, నగదును చోరులు చాక చక్యంగా కొట్టేశారు. రాజమహేంద్రవరం పట్టణంలోని ఒన్టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెయిన్రోడ్డులోని సిద్ధి జ్యుయెలరీ షాపులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సయ్యర్ అన్నార్ అనే వ్యక్తి జ్యుయెలరీ షాపులకు వెండి ఆభరణాలు, వస్తువులను సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ సహాయకుడితో కలసి అన్వర్ శుక్రవారం రాత్రి సిద్ధి జ్యుయెలరీ షాపుకు వచ్చారు. రూ.40 వేల విలువైన వస్తువులను అందించారు. భోజనం కోసం రూ. 5 లక్షల నగదు, 2 కిలోల వెండి వస్తువులతో ఉన్న బ్యాగులను షాపులో పెట్టి బయటకు వెళ్లారు. అదే సమయంలో షాపులోకి వచ్చిన ఇద్దరు మహిళలు, ఓ యువకుడు ఆ బ్యాగులను కొట్టేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు షాపులోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement