పేర్లు ఇవ్వకుంటే ఫుటేజీ తెప్పిస్తాం
కోడి పందేలు నిర్వహించిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పందేలు నిర్వహించిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడి పందేలు నిర్వహించి తీరుతామంటూ సవాళ్లు విసిరిన ప్రజా ప్రతినిధులను తాము టీవీల్లో చూశామని, వారి పేర్లను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పేర్లు ఇవ్వ కుంటే టీవీల నుంచి ఫుటేజీ తెప్పించుకుని వారిని ప్రతి వాదులుగా చేరుస్తామంది.
పందేలు జరిపిన నిర్వాహకుల్లో ప్రజా ప్రతినిధులు ఎంతమంది? ఎంతమందిపై కేసులు పెట్టారో చెప్పాలంది. తాము కోరిన వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎస్ దినేష్ కుమార్ సోమవారం విచారణకు హాజరై నివేదిక సమర్పించారు.