మేఘాలకు చిల్లులు పడ్డాయా.. ఆకాశం ఊడిపడిందా.. అన్నట్టుగా గత ఆరు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది.
సాక్షి, హైదరాబాద్: మేఘాలకు చిల్లులు పడ్డాయా.. ఆకాశం ఊడిపడిందా.. అన్నట్టుగా గత ఆరు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. అన్నదాతకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు కుళ్లిపోతున్నాయి. ఆస్తి నష్టం కూడా భారీగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారమే 15వేల ఇళ్లు కూలిపోయాయి. వాస్తవానికి వీటి సంఖ్య 30 వేల పైనే ఉంటుందని అనధికారిక అంచనా. వేలాది కిలోమీటర్ల పొడవునా రహదారులు ధ్వంసమయ్యాయి. వెయ్యిపైగా చెరువులకు గండ్లుపడ్డాయి. ఇప్పటికే అలుగులు పొర్లుతున్న అనేక చెరువులు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
వరదతో రోడ్లు చెరువుల్లా మారడం, రహదారులు ఎక్కడికక్కడ తెగిపోవడంతో అనేక గ్రామాలకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. రైలు రవాణా వ్యవస్థపై కూడా వర్షాల ప్రభావం పడింది. రైలు పట్టాలపై నీరు చేరడంతో అనేక రైళ్లు రద్దు కాగా కొన్ని రైళ్లను రూటు మార్చాల్సి వచ్చింది. మరోవైపు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రవాణా సదుపాయం లేకపోవడంతో ముంపు గ్రామాల్లోని వారు నిత్యావసరాల కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం నాటికి వరద మృతుల సంఖ్య 32కు పెరిగింది.
4,040 గ్రామాల్లో తీవ్ర నష్టం..
వర్షాల కారణంగా 16 జిల్లాల్లోని 472 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తమ్మీద 4,040 గ్రామాల్లో పెను నష్టం జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా వీటి సంఖ్య 8 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 15 వేల ఇళ్లు కూలిపోగా.. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 3,956, మహబూబ్నగర్ జిల్లాలో 3,054 ఇళ్లు ఉన్నాయి.
రైతులకు కోలుకోలేని దెబ్బ..
వర్షాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. కోత దశలో ఉన్న పత్తి, వరి, మొక్కజొన్న, కంది పంట పొలాలు నిండా మునిగాయి. వర్షంతో పంటలన్నీ నేలవాలి నీటిలో కుళ్లిపోతున్నాయి. వరి, వేరుశనగ పంటలు నీటిలో నానడంతో చేనులోనే మొలకలు వస్తున్నాయి. 10.17 లక్షల ఎకరాల్లో పత్తి దెబ్బతినడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 8.70 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చేతికొస్తున్న సమయంలో పంటలను ఇలా వర్షాలు మింగేయడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పంటలతోపాటు.. పాడి నష్టం కూడా రైతన్న వెన్ను విరిచింది. వర్షాలు, వరదలతో సుమారు రెండు వేలకుపైగా పశువులు చనిపోయాయి. రైతులను వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని వ్యవసాయ అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1,020 చెరువులకు గండ్లు
వర్షాలు, వరదలవల్ల 1,020 చెరువులకు గండ్లు పడ్డట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు సమాచారం అందింది. ప్రాథమిక సమాచారం ప్రకారమే 4,047 కిలోమీటర్ల పొడవునా రహదారులు, భవనాల శాఖకు చెందిన రోడ్లు ధ్వంసమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 710, కర్నూలులో 668, గుంటూరులో 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 1,068 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ శాఖకు చెందిన రోడ్లు ఇంకా ఎక్కువగానే దెబ్బతిన్నా ఇంకా క్షేత్రస్థాయి సమాచారం రాలేదు. 200 వరకూ నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి.
నార్కట్పల్లిలో వర్ష బీభత్సం..
శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లాను వర్షం ముంచెత్తింది. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నమోదైన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ ఏకంగా 30.9 సెం.మీ. వర్షం కురిసింది. తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కేరు వాగు ఉధృతిలో 3వేల మోటార్లు కొట్టుకుపోయాయి. జిల్లాలోని మోత్కూరులో 27.7, కట్టంగూరులో 19.8, ఆత్మకూరులో 18.8, వెలుగుపల్లెలో 18.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సత్తెనపల్లిలో 18, తిరువూరులో 15, భువనగిరిలో 14, పెద్దాపురం, రామన్నపేటలో 13, నందిగామలో 12, తుని, భద్రాచలంలో 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
207 పునరావాస శిబిరాలు
భారీవర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం తొ మ్మిది జిల్లాల్లో 207 సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 79 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.
39కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి నెట్వర్క్: వర్షాల్లో మరణిస్తున్నవారి సంఖ్య శనివారం నాటికి 39కి చేరింది. గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, నల్లగొండలో ఐదుగురు, మహబూబ్నగర్లో నలుగురు, హైదరాబాద్, కర్నూలు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, పశ్చిమ గోదావరి, వరంగల్ ఇద్దరు చొప్పున వరదల వల్ల మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదకు చెందిన ఎస్కే మస్తాన్ తన మూడేళ్ల కుమార్తె పర్వీన్ను స్కూల్కు తీసుకుని వెళ్లేందుకు వాగు దాటుతుండగా గల్లంతయ్యారు. పర్వీన్ మృతదేహం లభ్యం కాగా మస్తాన్ ఆచూకీ ఇంకా తెలియలేదు. కాగా, ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలం మారేడుబాకలో పశువుల కాపరి దరావత్ ధూక్యా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు.
రైతుల ఉసురు తీస్తున్న వర్షాలు: వరదలకు పంటలు తీవ్రంగా దెబ్బతినడాన్ని భరించలేక విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో మహాదేవ స్వామినాయుడు(45), ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెంలో బొప్పిశెట్టి చెన్నారావు(55) శనివారం గుండెపోటుతో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా అంకోలికి చెందిన దాండ్ల రాములు (60) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.