
మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మానవ అక్రమ రవాణా అత్యంత హేయమని, దానిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు...
జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్
ఏలూరు అర్బన్ : మానవ అక్రమ రవాణా అత్యంత హేయమని, దానిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక హెల్ప్ సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. మానవ అక్రమ రవాణాలో జిల్లా రాష్ట్రంలో ముందువరుసలో ఉండడం బాధాకరమని ఎస్పీ తెలిపారు.
దానిని నియంత్రించేందుకు, కారకులను గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇప్పటివరకు తాము గుర్తించిన కేసుల్లో మహిళలు 59 శాతం, బాలికలు 17 శాతం కాగా బాలురు 10 శాతంగా ఉన్నారని వివరించారు. ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాదారులు పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఉపాధి పేరిట మోసగించి గల్ఫ్ దేశాలకు తరలించి వారిని బలవంతాన వ్యభిచార కూపాల్లో నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద వర్గాలకు చెందిన మహిళలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా మెలగాలని సూచించారు. బాలల సంక్షేమ న్యాయమూర్తుల పీఠం చైర్మన్ టీఎన్ స్నేహన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. బాలల రక్షణ విషయంలో సీడ బ్ల్యుసీదే తుది నిర్ణయంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎస్పీ మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో సూర్యచక్రవేణి, డీసీఆర్బీ డీఎస్పీ పైడేశ్వరరావు, సీడబ్ల్యుసీ సభ్యులు పి.విజయనిర్మల, యు.రాజ్కుమార్, ఎస్ఎన్ కట్టా తదితరులు పాల్గొన్నారు.