
జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్న హర్షవర్ధన్ తల్లిదండ్రులు
శ్రీకాకుళం , వీరఘట్టం: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుకున్న తమ కుమారుడు ఉగిరి హర్షవర్ధన్ను ఈ ఏడాది జూలై 24న కళాశాలకు చెందిన కొందరు వ్యక్తులు మేనేజ్మెంట్తో కలసి హత్య చేయించారని తల్లిదండ్రులు వెంకటరమాప్రసాద్, నాగమణిలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వీరఘట్టం వచ్చిన వైఎస్ జగన్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. టెక్కలి సమీపంలో రైల్వే ట్రాక్పై అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కళాశాల యాజమాన్యం సృష్టించారని తెలిపారు.
హర్షవర్దన్ మృతి చెంది మూడు నెలలు గడిచినా పోలీసుల దర్యాప్తు మొక్కుబడిగానే మా రిందని తల్లిదండ్రులు వాపోయారు. నేటికీ ఈ కేసు గురించి ఏమీ తెలియలేదని చెప్పారు. తమ కుమారుడిని కళాశాలకు చెందిన కొందరు సీనియర్ విద్యార్థులు, యాజమాన్యంతో కలసి హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించారని హర్షవర్ధన్ తండ్రి వెంకటరమాప్రసాద్ అన్నారు. గత మూడు నెలలుగా ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్ను, పోలీసు ఉన్నతాధికారులందరినీ కలసి విన్నవించుకున్నామని చెప్పారు. సాక్షాత్తు ఎస్పీ హామీ ఇచ్చినా దర్యాప్తు సమగ్రంగా జరగడం లేదని వాపోయారు. గత నాలుగు నెలలుగా తాము పడుతున్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదని, తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని వైఎస్ జగన్ను కోరారు.