కొర్రీ వర్రీ! | Grant of old dues Corporation | Sakshi
Sakshi News home page

కొర్రీ వర్రీ!

Mar 6 2015 1:05 AM | Updated on Sep 2 2017 10:21 PM

కొర్రీ వర్రీ!

కొర్రీ వర్రీ!

స్థానిక సంస్థలు తామిచ్చే నిధులపై ఆధారపడకూడద ని పదేపదే చెబుతున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

కార్పొరేషన్ గ్రాంట్‌కు ఏలికల మెలిక
 పాత బకాయిలు  వసూలుచేస్తేనే నిధులు
రూ. 22.19 కోట్లు రావాల్సింది ప్రభుత్వాల నుంచే
 అయోమయంలో అధికారులు

 
 విజయవాడ సెంట్రల్ : స్థానిక సంస్థలు తామిచ్చే నిధులపై ఆధారపడకూడద ని పదేపదే చెబుతున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆస్తి పన్ను నూరు శాతం వసూలుచేయడంతోపాటు పాత బకాయిలు రాబట్టనట్లయితే గ్రాంట్‌ను నిలిపివేస్తామంటూ తాజాగా జీవో జారీ చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.74.60 కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.55 లక్షలు వసూలైంది. మిగిలిన రూ. 19.60 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలుచేయాల్సి ఉంది. ఏటా 90 నుంచి 95 శాతం మేర పన్నులు వసూలవుతున్నాయి. కాబట్టి ఆస్తి పన్ను డిమాండ్ లక్ష్యాన్ని చేరుకుంటారనడంలో ఎలాంటి అనుమానం లేదు. వచ్చిన చిక్కల్లా మొండి బకాయిలతోనే.
 
మొహం చాటేసిన మంత్రులు
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 22.19 కోట్ల మేర ఆస్తి పన్ను రావాల్సి ఉంది. 1995 నుంచి బకాయిలు పేరుకుపోయాయి.  వీటిని రాబట్టేందుకు మేయర్ కోనేరు శ్రీధర్ రాష్ట్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే చూద్దామన్న వారు ఆచరణలో రిక్తహస్తం చూపారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి  రూ.8 కోట్ల 19 లక్షల 56 వేల 740 రావాల్సి ఉంది. 2001 నుంచి  బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. సేవలు, సర్దుబాటు విషయమై గతంలో  కార్పొరేషన్, రైల్వే అధికారుల మధ్య చర్చలు జరిగాయి. 50 శాతం చెల్లించాల్సిందిగా కార్పొరేషన్ కోరగా, 30 శాతానికి మించి చెల్లించలేమని రైల్వే అధికారులు పేచీకి దిగారు. ఇలాంటి మొండి సమస్యలు కార్పొరేషన్‌ను పట్టిపీడిస్తుంటే గ్రాంటు ఆపేస్తాననడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

సర్కార్ బకాయిల మాటేమిటి?

రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే  నగరపాలక సంస్థ పరిధిలో 22 శాఖలకు సంబంధించి 189 అసెస్‌మెంట్ల నుంచి రూ.13 కోట్ల 67 లక్షల 97 వేల 493 వసూలుకావాల్సి ఉంది. ఏటా కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు అందిస్తున్న ఆస్తి పన్ను డిమాండ్‌ను ఆయా శాఖలు బుట్టదాఖలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రమే. వివిధ కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారమైతే మరో రూ.8 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.  ఎరి యర్స్ వసూలైతేనే గ్రాంట్ ఇస్తామని ప్రభుత్వం మెలిక పెట్టడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

స్పెషల్‌డ్రైవ్.. దీర్ఘకాల  పన్ను బకాయిలు ఉన్న గృహాలు, వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. బకాయిదారుల జాబితాను కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన అధికారులు గురువారం నుంచి ప్రత్యక్ష దాడులకు దిగారు. సర్కిల్-2 పరిధిలో ఎప్పట్నుంచో బకాయిలున్న గృహా లకు  నీటి కనెక్షన్లు తొలగించారు. పూర్ణానందంపేటలో నాలుగేళ్లుగా పన్ను చెల్లించని  గృహాన్ని, గవర్నర్‌పేటలోని వ్యాపార సం స్థను  సీజ్ చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో రూ.10,93,216 వసూలు చేసినట్లు ఏసీ  ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement