వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా జెడ్పీటీసీ సభ్యులకు తగిన రక్షణ కల్పించాలని హైకోర్టు శుక్రవారం జిల్లా పోలీసులను ఆదేశించింది.
నెల్లూరు ఎస్పీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా జెడ్పీటీసీ సభ్యులకు తగిన రక్షణ కల్పించాలని హైకోర్టు శుక్రవారం జిల్లా పోలీసులను ఆదేశించింది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఎన్నిక పూర్తయ్యేంత వరకు వారి రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీకి హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులపై ఏవైనా కేసులు ఉంటే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని... ఎన్నిక పూర్తయిన తరువాత చట్ట ప్రకారం తగిన చర్యలకు ఉపక్రమించవచ్చునని పోలీసులకు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు.