‘చచ్చిపోయినా నిన్ను మర్చిపోను బావా’ | girl committs suicide in nidudavolu over love failure | Sakshi
Sakshi News home page

‘చచ్చిపోయినా నిన్ను మర్చిపోను బావా’

Jun 23 2017 11:55 AM | Updated on Nov 6 2018 8:08 PM

‘చచ్చిపోయినా నిన్ను మర్చిపోను బావా’ - Sakshi

‘చచ్చిపోయినా నిన్ను మర్చిపోను బావా’

ప్రియమైన బావకు నువ్వంటే నాకు ప్రాణం.. నేనంటే నీకు చాలా ఇష్టం కదరా.. మరి నన్ను ఎలా మోసం చేశావు..

ప్రేమ విఫలం కావడంతో యువతి బలవన్మరణం
ఇంట్లో దూలానికి ఉరివేసుకున్న వైనం
చివరిగా ప్రియుడు, తల్లిదండ్రులకు లేఖలు
తాళ్లపాలెంలో విషాద ఘటన


నిడదవోలు రూరల్‌: ‘ప్రియమైన బావకు నువ్వంటే నాకు ప్రాణం.. నేనంటే నీకు చాలా ఇష్టం కదరా.. మరి నన్ను ఎలా మోసం చేశావు.. నన్ను ఎందుకు వదిలేశావు. నీతో పెళ్లి అనగానే ఎన్నో కలలు కన్నాను. నాలో చాలా కోరికలు.. ఆశలు పెట్టుకున్నాను. నువ్వే నా ప్రాణం రా.. నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. నీ జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్నాను. నేను చనిపోయినా మరిచిపోనురా’ అంటూ తన ప్రియుడికి చివరసారిగా ప్రియురాలు లేఖ రాసి తనువు చాలించింది. ప్రేమ విఫలం కావడంతో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నిడదవోలు మండలం తాళ్లపాలెంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన పిల్లి కొండబాబు, బేబి దంపతులు తాళ్లపాలెంలో నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమార్తె నాగరత్నం (21) ఏడో తరగతి వరకు చదివి కొంతకాలం హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ కుటుం బానికి ఆసరాగా ఉండేది. ఆ సమయంలో వీరి బంధువు అట్లపాడు గ్రామానికి చెందిన పెంటపాటి సొలోమాన్‌ కుమారుడు కల్యాణ్‌ను ఇష్టపడింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నా రు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంతో నాగరత్నం కుటుంబసభ్యులు రూ.74 వేలను ఆరు నెలలు క్రితం కల్యాణ్‌ కుటుంబానికి అప్పుగా ఇచ్చారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని నాగరత్నం ఎంతో ఆశ పెట్టుకుంది. అయితే పెద్దలు వీరి వివాహానికి పూర్తిగా అంగీకరించకపోవడంతో కల్యాణ్‌ సుమారు 13 రోజులుగా నాగరత్నంకు ఫోన్‌ చేయడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దూలానికి ఉరి వేసుకుని తనువు చాలించింది. మృతురాలి తల్లి బేబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై జి.సతీష్‌ తెలిపారు. గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

మనస్తాపంతో రెండు లేఖలు
నాగరత్నం ఉరివేసుకునే ముందు కల్యాణ్‌ ప్రేమ విషయంలో చాలా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. నాలుగు పేజీల ప్రేమలేఖను ప్రియుడి పేరుపై రాసింది. మరో రెండు పేజీల లెటర్‌ను తల్లిదండ్రులకు రాసింది. నాన్న ఎంతో మంచివాడని జాగ్రత్తగా చూసుకోమని తల్లి బేబిని కోరింది. తన భర్తగా కల్యాణ్‌ను ఊహించుకున్నానని, తమ ప్రేమకు కల్యాణ్‌ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రెండు లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 videofor

Advertisement
 
Advertisement
Advertisement