కోళ్లు.. కోట్లు | Festival of the Bonfires | Sakshi
Sakshi News home page

కోళ్లు.. కోట్లు

Jan 15 2016 12:41 AM | Updated on Sep 3 2017 3:41 PM

సంక్రాంతి పర్వదినాల్లో మొదటిదైన భోగి పండగ సందర్భంగా జిల్లాలో గురువారం విస్తృతంగా కోడిపందేలు నిర్వహించారు.

అమలాపురం :సంక్రాంతి పర్వదినాల్లో మొదటిదైన భోగి పండగ సందర్భంగా జిల్లాలో గురువారం విస్తృతంగా కోడిపందేలు నిర్వహించారు. పలువురు వేలు, లక్షల్లో పందేలు కాశారు. దీంతో తొలి రోజే జిల్లాలో ఏకంగా రూ.25 కోట్ల వరకూ కోడిపందేలు జరిగినట్టు అంచనా. గుండాట బోర్డుల వద్ద రూ.500కు తక్కువ పందెం లేదని నిర్ణయించారు.
 
 హైకోర్టు అడ్డుకట్ట వేసినా.. అధికార పార్టీ నేతలు తమ పలుకుబడి వినియోగించి కోడిపందేలకు అనధికార అనుమతి సాధించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై పశ్చిమ గోదావరి నేతల ఒత్తిడి చాలావరకూ ఉన్నా, మన జిల్లా నేతలు సైతం తమవంతు పాత్ర పోషించారు. దీంతో ప్రధాన రహదారులను ఆనుకుని కోట్ల రూపాయల పందేలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.
 
 తిరునాళ్లగా మారిన మురమళ్ల
 అందరూ ఊహించినట్టుగానే ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగాయి. తొలి రోజు ఈ ఒక్కచోటనే రూ.10 కోట్ల వరకూ పందేలు జరిగినట్టు అంచనా. తొలి పందెమే రూ.5 లక్షలతో మొదలవగా, యజమానులు ఒక్కో పందేన్ని రూ.10 లక్షల వరకూ కాస్తున్నారు. వీరితోపాటు చుట్టూ జనం కూడా వారిలో వారు పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. దీంతో పెద్ద బరిలో ఒక్కో పందేనికి రూ.50 లక్షల వరకూ చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. మరో రెండు చిన్న బరుల్లో ఒక్కో పందెం రూ.20 లక్షల వరకూ కాస్తున్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు దగ్గరుండి మరీ ఈ పందేలు నిర్వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో కాట్రేనికోన మండలం చెయ్యేరు, పల్లంకుర్రు, ముమ్మిడివరం, తాళ్లరేవుల్లో సహితం పందేలు జరిగాయి. కోనసీమలోని అల్లవరం, గోడిలంక, కొమరగిరిపట్నాల్లో పెద్ద ఎత్తున పందేలు నిర్వహించారు. గోడిలంకలో తొలి రోజు రూ.కోటి వరకూ పందేలు జరిగాయి. అమలాపురం, ఉప్పలగుప్తం, ఆత్రేయపురం, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో కూడా పందేలు జరిగాయి.
 
 మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం, కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కాజులూరు మండలం పల్లెపాలెం, రామచంద్రపురం మండలం హసనబాదలో కోడిపందేలు, గుండాటలను అధికార పార్టీ నేతలు దగ్గరుండి నిర్వహిస్తున్నారు. కొప్పవరం, మండల కేంద్రమైన బిక్కవోలు, రంగంపేట, పెదపూడి, జి.మామిడాడ గ్రామాల్లో పందేలు సాగుతున్నాయి. పిఠాపురం పట్టణం వైఎస్సార్ గార్డెన్స్‌లో కోడిపందేలను ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ప్రారంభించారు. విరవ, పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం వాకతిప్ప, యండపల్లి, కొండెవరం, ఇసుకపల్లి, శ్రీరాంపురం, గొల్లప్రోలు మండలం కొడవలి, దుర్గాడ గ్రామాల్లో పందేలు జరుగుతున్నాయి.
 
 మెట్టలోనూ అదే జోరు
 మెట్ట ప్రాంతంలోని కిర్లంపూడిలో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహిస్తున్నారు. జగ్గంపేట, గండేపల్లి, గోకవరం మండలాల్లో పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. తుని మండలం తేటగుంట, వి.కొత్తూరు, వల్లూరుతోపాటు, తొండంగి, కోటనందూరు మండలాల్లో పందేలు సాగుతున్నాయి. సామర్లకోట మండలం వేట్లపాలెం, మేడపాడు, అచ్చంపేట, పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం, జి.రాగంపేటల్లో పందేలు జోరుగా జరిగాయి. మొదటి రోజు రూ.50 లక్షలు చేతులు మారినట్టు అంచనా.

 రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి, పాత బొమ్మూరు, శాటిలైట్ సిటీల్లోని కొబ్బరి తోటలు పందేలకు వేదికలయ్యాయి. దివాన్‌చెరువు, పుణ్యక్షేత్రం,  మల్లంపూడి, తోకాడతోపాటు సీతానగరం మండలంలో పందేలు జరిగాయి. ఏజెన్సీలోని దేవీపట్నం, గంగవరం మండలాలతోపాటు పలుచోట్ల పందేలు జరిగాయి. విలీన మండలాలైన వీఆర్ పురం, కూనవరం మండలాల్లో రూ.30 లక్షల వరకూ పందేలు సాగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి పందెగాళ్లు వీఆర్ పురం, కూనవరం తరలివచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement