రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మహిళా వ్యతిరేకి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు.
పూండి(వజ్రపుకొత్తూరు):రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మహిళా వ్యతిరేకి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. గోవిందపురంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతుంటే మంత్రి దాన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. దీన్నిబట్టే ఆయనకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు.
డ్వాక్రా మహిళలు మాఫీని అడుగుతున్నారో లేదో తెలుసుకోవాలంటే తమవెంట వస్తే మంత్రికి చూపిస్తామన్నారు. హుద్హుద్ తుపాను కారణంగా నష్టపోయిన జిల్లా ప్రజలకు ఎంత పరిహారం ఇప్పించారో మంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కేటాయిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగడుతున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై అధికారపక్ష నేతలు ఎదురుదాడికి దిగుతుండడం తగదన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ప్రతిపక్ష నేత ప్రశ్నలకు జవాబు చెప్పలేక వ్యక్తిగత దూషణలతో దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, తిలక్, మరడ భాస్కరరావు, కొర్రాయి గిరిబాబు ఉన్నారు.