బరిలో బంధుగణం! | Family Politics In Srikakulam | Sakshi
Sakshi News home page

బరిలో బంధుగణం!

Apr 1 2019 1:11 PM | Updated on Apr 1 2019 1:11 PM

Family Politics In Srikakulam - Sakshi

ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, తమ్మినేని సీతారాం, కూన రవి, రామ్మోహన్‌నాయుడు

సాక్షి, శ్రీకాకుళం: ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ఇవి ఓటర్లలో ఆసక్తిని రేపుతున్నాయి. సమీప బంధువులు, రక్త సంబంధీకులు వివిధ పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ నర్సన్నపేట నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆమదాలవలస నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆయనపై టీడీపీ అభ్యర్థిగా ఆయన బావమరిది (భార్య సోదరుడు) కూన రవికుమార్‌ తలపడుతున్నారు. టీడీపీ తరఫున శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఆయన బాబాయ్‌ (తండ్రికి సొంత సోదరుడు) కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారు. అలాగే రాజాం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కంబాల జోగులు బరిలో ఉండగా ఆయన బాబాయ్‌ (తండ్రి సోదరుడి) కుమారుడు కంబాల రాజవర్థన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

విశేషమేమిటంటే వీరిలో రాజాం నుంచి బరిలో ఉన్న కంబాల జోగులు, రాజవర్థన్‌ (ఈయన తొలిసారిగా పోటీలో ఉన్నారు)లు మినహా మిగిలిన వారంతా 2014 సార్వత్రిక ఎన్నికలోనూ అవే స్థానాల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల్లో తలపడుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ చుట్టాలు, బంధువులను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయా అభ్యర్థుల బంధుత్వాల గురించి ఆయా నియోజకవర్గాల ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement