
పదో తరగతి పరీక్షలకోసం విద్యార్థులకు స్టడీ క్యాంప్ నిర్వహిస్తున్న దృశ్యం, డాక్టర్ అర్షియ ఫిర్దోష్ మండల వైద్యాధికారి
చింతలపూడి: పరీక్షల వేళ విద్యార్థులు చదువుమీద ధ్యాసతో ఆహార పానీయాల సంగతి మర్చిపోతారు. గంపెడు సిలబస్ను వడపోసి క్వొశ్చన్ పేపర్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు రాయాలంటే ముందుగా విద్యార్థికి కావలసింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండి మంచి వాతావరణంలో చదివితే ఫలితం ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రులు చేయవలసిందేంటంటే పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు తేలికపాటి ఆహారం అందించడం ఉత్తమమని చింతలపూడి మండల వైద్యాధికారి డాక్టర్ అర్షియ ఫిర్దోష్ చెప్తున్నారు. రోజూ ఇళ్లల్లో వండే వంటల్లోనే చిన్న, చిన్న మార్పులతో తేలికపాటి ఆహారాన్ని వండి పెట్టాలని తల్లులకు సూచిస్తున్నారు.
ఇలా చేయండి
⇔ అధిక కారం, మసాలా, నూనెలతో తయారైన ఆహార పదార్థాలను పెట్టకండి. వాటికి దూరంగా ఉంచండి.
⇔ ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర పోవడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, రసంతో భోజనం మంచిది. పెరుగు, మజ్జిగ పరిమితంగా తీసుకోవాలి.
⇔ అందుబాటులో ఉండే తాజా పళ్లు తీసుకోవాలి. ద్రాక్ష, అరటిపండు, అనాస, దోస వంటి పండ్లు ఆరోగ్యానికి మంచిది.
⇔ పరీక్షలు జరిగే రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. మంచి ఆహారంతో పరీక్షల గండం గట్టెక్కినట్టే.
⇔ మెదడు తాజాగా ఉండాలంటే పరీక్షల సమయంలో విద్యార్థులు ఉదయం 4.30 గంటలకు లేవడం, రాత్రి 10.30 గంటలకు ముందుగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
⇔ మెదడు చురుగ్గా పనిచేయడానికి ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చిక్కుడు, కూరగాయలు, పండ్లు తినాలి.
⇔ ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు వ్యాయామం చేస్తే మంచిది. తర్వాత ఇడ్లీ, పాలు తీసుకోవడం ఉత్తమం. అనంతరం చదువు ప్రారంభించాలి.
⇔ పరీక్ష రాసి ఇంటికి వచ్చాక పండ్లు, పళ్ల రసాలు తాగాలి. పెరుగుతో ఆహారం భుజించడం కూడా మంచిదే.
⇔ సాయంత్రం చదువు ప్రారంభించేటప్పుడు కప్పు టీ తాగాలి. చదవడం అయిపోయాక నిద్రకు ఉపక్రమించే గంట ముందు తేలికపాటి భోజనం తీసుకోవాలి.
⇔ ఒత్తిళ్లకు గురికాకుండా నిద్రపోవాలి. రోజులో ఎక్కువసార్లు పాలు తాగండి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
⇔ ఒకసారి రాస్తూ చదివితే పదిసార్లు చదివినట్టు అర్థం. విద్యార్థులూ ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిట్కాలను పాటించి విజయాన్ని సాధించండి