‘బండ’ భారంపైగరంగరం | common peoples are fire on gas cylinder price | Sakshi
Sakshi News home page

‘బండ’ భారంపైగరంగరం

Jan 5 2014 5:57 AM | Updated on May 25 2018 9:12 PM

గ్యాస్ ధర పెంపుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. ప్రజలపై పెనుభారం మోపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఖమ్మం, న్యూస్‌లైన్:
 గ్యాస్ ధర పెంపుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. ప్రజలపై పెనుభారం మోపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బైఠాయించి, ధర్నా చేశారు. ఖమ్మంలో పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోటరీనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టి, గ్యాస్‌బండలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు.  
 
     గార్ల నెహ్రూసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. మండల కన్వీనర్ పఠాన్ మీరాఖాన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుండా వెంకటరెడ్డి తదితరులు ఈ ఆందోళనను ఉద్దేశించి మాట్లాడారు.
 
     పెరిగిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ మధిర తహశీల్దార్ కార్యాలయం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఆర్‌వీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై వంటావార్పుతో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఎర్రుపాలెంలోని అంబేద్కర్‌సెంటర్‌లో పార్టీ కార్యాలయం ఎదుట రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. యూపీఏ ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్‌సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్‌ఐ లక్ష్మీనర్సుకు వినతిపత్రం అందజేశారు.
 
 ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సామాన్యకిరణ్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. బోనకల్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, తహశీల్దార్ షేక్ ముంతాజ్‌కు వినతిపత్రం అందజేశారు.
 
     పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక మండల కేంద్రాల్లో రాస్తారోకోలు చేశారు. పినపాక మండల కన్వీనర్ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ఎడూళ్ళ బయ్యారం క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. మణుగూరు మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి సమీపంలోని కోడిపుంజల వాగు బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. మండల, పట్టణ కన్వీనర్‌లు కుర్రి నాగేశ్వరరావు, ఆవుల నర్సింహారావు, పాయం ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
 
     అశ్వారావుపేట నియోజకవర్గంలోని ముల్కలపల్లి మండలకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.
 వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ పుష్పాల చందర్‌రావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బండి కొమరయ్య, నాయకులు తాండ్ర రాంబాబు, సున్నం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 
     వైరా నియోజకవర్గ సమన్వయకర్త బాణోత్ మదన్‌లాల్ ఆధ్వర్యంలో క్రాస్‌రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపై కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి టీ చేశారు. గ్యాస్ ధర పెంచడాన్ని మదన్‌లాల్ తదితరులు వ్యతిరేకించారు.
 
     భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ తెల్లం వెంకట్రావ్, తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్‌డీవో కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహించారు. ఆర్‌డీవో కాసా వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందచేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement