
అనాథలుగా మారిన చిన్నారులు
కౌలు రైతు కూరపాటి సాంబయ్య, కోటేశ్వరమ్మ దంపతుల ఆత్మహత్యతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.
కౌలు రైతు దంపతుల మృతితో ఉంగుటూరులో విషాదం
అమరావతి: కౌలు రైతు కూరపాటి సాంబయ్య, కోటేశ్వరమ్మ దంపతుల ఆత్మహత్యతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున సాంబయ్య దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి మృతితో ఎనిమిదేళ్ల కుమార్తె మేరీరాణి, ఐదేళ్ల కుమారుడు జోష్బాబు అనాథలుగా మిగలడం చుట్టుపక్కలవారిని కంటతడి పెట్టిస్తోంది.
పిల్లలకు ప్రభుత్వ సాయం అందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ సాయం చేసే నాథుడు కూడా లేక అంత్యక్రియలు పూర్తి చేసేశారు. దీంతో పిల్లల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అధికారులు సాంబయ్య కుటుంబానికి పూర్తి స్థాయిలో సాయం అందేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కొండలా పెరిగిన అప్పులు..
ఉంగుటూరు ఎస్సి కాలనీకి చెందిన సాంబయ్య వ్యవసాయకార్మికుడు. మొదటి భార్య పదేళ్ల క్రితం చనిపోవటంతో కోటేశ్వరమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె శివకుమారికి వివాహం చేసి అత్తారింటికి పంపారు. రెండభార్యకు ఎనిమిదేళ్ల కుమార్తె మేరిరాణి, ఐదేళ్ల కుమారుడు జోష్బాబు ఉన్నారు.
కౌలుకు పొలం తీసుకొని రెండెకరాలలో మిరపతోట, మరో రెండు ఎకరాలలో పత్తిని సాగుచే యగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ఖర్చులు విపరీతంగా పెరగటంతోపాటు వాతావరణ ప్రతి కూల పరిస్థితుల వల్ల దిగుబడి రాక నష్టాలపాలయ్యాడు. నాలుగేళ్లుగా ఏడాదికేడాది కొండలాగా అప్పులు పెరిగి సుమారు 4లక్షల రూపాయలయ్యాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక సాంబయ్య దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.