రాజమండ్రి పుష్కర ఘాట్లో విషాద ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యుడని, ఆయనను అరెస్ట్ చేయూలని వైఎస్సార్ సీపీ
సాక్షి, కొవ్వూరు : రాజమండ్రి పుష్కర ఘాట్లో విషాద ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యుడని, ఆయనను అరెస్ట్ చేయూలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. బుధవారం కొవ్వూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కర ఘాట్ ఘటనకు ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆదేశాలతోనే అధికారులు వీఐపీ ఘాట్లను ఏర్పాటు చేశారని, వీవీఐపీ హోదాలో ఉన్న వ్యక్తి సాధారణ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించటంవల్ల ఈ ఘోరం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. న్యాయవిచారణ పేరుతో దీనిని తప్పుదోవ పట్టించి సంబంధం లేని అధికారిని బలిచేయటానికి చంద్రబాబు పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవిచారణ పేరుతో రెవెన్యూ, పోలీస్ అధికారులను బలిచేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఘటనకు సంబంధించి అన్ని వాస్తవాలు వీడియో ఆధారాలతో పాటు లక్షల మంది ప్రజలు చూశారని, ఇంకా చంద్రబాబు నాయుడు న్యాయవిచారణ అని మాట్లాడటం ఎంతరకు సమంజసం అని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పుష్కర యాత్రికులకు ఎక్కడా అసౌకర్యం కలిగించకుండా పుణ్యస్నానాలు ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు.