సీమ, ప్రకాశంకు నీరందిస్తా: బాబు | Chandrababu naidu promises to give water for Rayalaseema and Prakasam districts | Sakshi
Sakshi News home page

సీమ, ప్రకాశంకు నీరందిస్తా: బాబు

Feb 20 2015 3:01 AM | Updated on Oct 20 2018 5:39 PM

కరువుతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు.

నీరు-చెట్టు ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు హామీ
బి.కొత్తకోట: కరువుతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు. పట్టిసీమ వద్ద ఈ నెల 23న ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని, తద్వారా మిగిలే శ్రీశైలం నీటిని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఇస్తామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం గ్రామం పెద్దచెరువులో గురువారం సీఎం నీరు-చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ నిర్మించిన నీరు-చెట్టు పైలాన్‌ను ప్రారంభించి, చెరువులో పూడికతీత మట్టిని జే సీబీతో ట్రాక్టర్‌లో పోశారు.

అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, నాగావళి, వంశధార నీటిని వినియోగించుకోవడం కోసం నదుల అనుసంధానం జరగాలన్నారు. ఏడాదిలోగా హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కృషి చేస్తానని, అవసరమైతే కాలువలపై నిద్రింైచె నా పనులు పూర్తి చేయిస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తోటపల్లి, వెలుగోడు ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు.
 
 ఐదేళ్లలో రూ.27,200 కోట్ల ఖర్చు
 నీరు-చెట్టు కార్యక్రమాన్ని చరిత్రాత్మకమైందిగా సీఎం అభివర్ణించారు. దీనికోసం రూ.27,200 కోట్ల నిధులను ఖర్చు చేస్తామన్నారు. గతంలో తాను నీరు-మీరు పథకం ద్వారా భూగర్భజలాల వృద్ధికి చర్యలు తీసుకుంటే పదేళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, నీటి నిల్వ చర్యలు చేపట్టనందునే ప్రస్తుతం కరువు వచ్చిందని అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంతో ఈ పరిస్థితిని అధిగమించి, రాష్ట్రాన్ని కరువు రహితంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పథకం తన ఒక్కడితోనే విజయవంతం కాదని, ప్రజలంతా బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలు సైతం కలసిరావాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నీటిలభ్యతపై సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. కాగా కరువు నెలకొన్న మండలాల్లో కూలీలకు 150 రోజుల వరకు పని కల్పిస్తామని సీఎం ప్రకటించారు.
 
 రుణమాఫీలో మేమే భేష్..
 దేశంలో ఒక్కో రైతుకు రూ.1.5 లక్షల మేరకు రుణ మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు చెప్పారు.దేశవ్యాప్తంగా 50 శాతం మంది రైతులు రుణాలు తీసుకుంటే రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు రుణాలు తీసుకున్నారని తెలిపారు. నిధుల సమస్య ఉన్నప్పటికీ రైతుల కళ్లల్లో ఆనందంకోసం రుణాలు మాఫీ చేశానని చెప్పుకొచ్చారు. మహిళా సంఘాలను తాను పైకి తీసుకొచ్చి పొదుపు నేర్పితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం నేర్పించిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement