Sakshi News home page

నంద్యాల ఓటర్లను బెదిరించిన చంద్రబాబు

Published Thu, Jun 22 2017 2:40 PM

నేను ఓటుకు రూ.5వేలు ఇవ్వగలను: చంద్రబాబు - Sakshi

కర్నూలు: జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే అదే సమయంలో సీఎంను కలిసేందుకు ప్రజలు అక్కడకు చేరుకుని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందుకు సీఎం సమస్యల చెప్పడం కాదు, వినండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం అన్న విషయం మరిచి దారుణంగా మాట్లాడారు.

తాను ఒక్కోఓటుకు 5 వేల రూపాయలు ఇవ్వగలనని...అలా ఇస్తే మళ్లీ అవినీతికి పాల్పడాల్సి వస్తుందని అన్నారు. కొందరు తానిచ్చిన పెన్షన్ తింటున్నారని, తాను వేసిన రోడ్ల మీదే నడుస్తున్నారని....కానీ తనకు ఓటు వేయనంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తన పాలన నచ్చకపోతే తానిచ్చే పెన్షన్లు తీసుకోవద్దని, తానేసిన రోడ్లపై నడవవద్దని ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే తనకు ఓట్లు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు.

నేను తలచుకుంటే...

‘రాయలసీమలో ఇప్పటికీ పెత్తందారీ వ్యవస్థే ఉంది. సీమ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి నాయకులను తీసుకొచ్చా. మా కంటే మా తర్వాత తరం నాయకులు మరింత పాజిటివ్‌గా ఉన్నారు. రాజకీయంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చాం. నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాయకుడు కావాలి, ఎన్నికలు గెలవాలి. గెలవడానికి నాయకుడు కావాలి కాబట్టి మేం కొన్ని రాజీ పడ్డాం. మేం రాజీపడడం వల్ల టీడీపీలో కొంతమందికి నష్టం కూడా జరిగింది.

కొంతమంది నాయకులకు నష్టం జరిగిందని కూర్చున్న చెట్టును నరుక్కుంటామా?. నావల్ల లాభం పొందినవాళ్లంతా మళ్లీ నాకు ఓటేయాలి కదా!. పదేళ్ల కిందే నేను అధికారంలో ఉంటే రాష్ట్రం ఎక్కడికో పోయేది. నేను వెయ్యి పెన్షన్‌​ ఇస్తున్నా. రుణమాఫీ చేశా, ఎవరు డబ్బిచ్చినా నాకే ఓటేయాలి. నేను తలచుకుంటే ఓటుకు 5వేల రూపాయిలు ఇవ్వగలను, కానీ ఎందుకు ఇవ్వాలి.

మీకు ఓటుకు 5 వేలు ఇవ్వాలంటే మీ దగ్గరే నేను 5 లక్షల చొప్పున వసూలు చేయాలి. నాకు వ్యతిరేకంగా ఏవైనా గ్రామాలుంటే వాటికో నమస్కారం పెడతా. నేనంటే మీకు ఇష్టం లేకపోతే... నేను మీకెందుకు పనులు చేయాలి?. నేనిచ్చిన పెన్షన్‌ తీసుకుంటున్నారు. నేనిచ్చిన రేషన్‌ తీసుకుంటున్నారు. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నాకు ఓటేయకుంటే ఎట్లా?. నా పరిపాలన బాగా లేదంటే నేనేమీ తీసుకోను. నాకేమీ వద్దు’ అని అన్నారు. కాగా చంద్రబాబు వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది.

Advertisement
Advertisement