కాసులొకరివి.. సోకులు ఇంకొకరివి.. | central funds are misleading in andhra pradesh | Sakshi
Sakshi News home page

కాసులొకరివి.. సోకులు ఇంకొకరివి..

Jul 24 2017 12:26 PM | Updated on Aug 20 2018 9:18 PM

చంద్రన్న బాట, ఎన్టీఆర్‌ జలసిరి, పంట సంజీవని పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

► కేంద్ర నిధులు పక్కదారి పడుతున్న వైనం
► పబ్బం గడిపేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం 

చంద్రన్న బాట, ఎన్టీఆర్‌ జలసిరి, పంట సంజీవని పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే వీటికి  నిధులు ఇచ్చేది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లించి పబ్బం గడుపుకుంటోంది. వివిధ పథకాలపై సుమారు రూ.460 కోట్లు ఖర్చు చేస్తోంది. 
 
చిత్తూరు, సాక్షి: జాతీయ ఉపాధి హామీ పథకానికి జాతిపిత గాంధీ పేరు ఆరంభం నుంచే ఉంది. ఆ పథకానికి సంబంధించి మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు ఖర్చు పెట్టుకునేందుకు ‘ చంద్రన్న బాట’ అంటూ ఓ పేరు పెట్టేసుకున్నారు. జిల్లాలో ఏడాది పొడవునా ఉపాధి హామీపై ఖర్చు చేసే నిధుల్లో 40 శాతం వరకు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద ఖర్చు చేసుకోవచ్చు. ఇలా ఏటా రూ.184 కోట్లు మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద వస్తాయి. ఈ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బాట పేరుతో గ్రామాల్లో రోడ్లు ఇతరాత్ర పనులు చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా చిల్లిగవ్వ కూడా లేకపోవడం గమనార్హం.
 
ఎన్టీఆర్‌ జలసిరిదీ అదే దారి..
నీటి సౌకర్యం లేని ప్రాంతాలతో పాటు.. నీటి సౌకర్యం ఉండే శివారు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఇదే ప«థకానికి ఇందిర జలప్రభ, ఇందిర ప్రభ అనే పేర్లు ఉండేవి. అప్పట్లో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఖర్చు చేసేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఆధార పడి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు, వెనుకబడిన ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ఎస్‌పీడీసీఎల్‌ నిధులతో పనులు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 
 
జలసిరి ద్వారా 3 వేల బోర్లు 
జలసిరి పథకం ద్వారా ఇప్పటి వరకు 3 వేల బోర్లు వేశారు. ఐదెకరాలలోపు ఉన్న ఎస్టీ, ఎస్సీ, సన్నకారు రైతులకు చెందిన భూముల్లో ఈ బోర్లు తవ్వుతారు. ఒకే ప్రాంతంలో అంతపెద్ద మొత్తంలో భూమి లేకపోతే ఇద్దరు, ముగ్గురు రైతులు కలిసి సంయుక్తంగా ఈ పథకానికి వినియోగించుకోవచ్చు. నీటికి అనుకూలమైన ప్రాంతాల్లో ఉన్న భూముల్లో ఈ బోర్లను తవ్వేందుకు యూనిట్‌ ధర రూ.1.19 లక్షలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో నీరు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయకట్టులో చిట్టచివర ఉన్న భూముల్లో బోర్లు తవ్వడానికి అనుమతులున్నాయి. 200 అడుగులు తవ్వేందుకు అడుగుకు రూ.80 చొప్పున రూ.16 వేలు కేటాయించనున్నారు. 20 మీటర్ల మేర పైపు వేసేందుకు రూ. 8 వేలు, బోరు బావి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకునేందుకు రూ.5 వేలు ఖర్చు చేస్తారు. 
 
 
ఐఎస్‌ఐ మోటారుకు రూ.40 వేలు, విద్యుత్‌ వైరు, కనెక్షన్‌ కింద రూ.50 వేలు ఎస్పీడీసీఎల్‌ ఖర్చు భరిస్తుంది. మొత్తం యూనిట్‌ ధరలో ఎస్సీ, ఎస్టీలైతే 5 శాతం, ఓసీ, బీసీ రైతులైతే 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎస్సీ రైతులైతే రూ.4,500, మిగతా రైతులు రూ.18,000 లబ్ధిదారుడి వాటా చెల్లించాల్సి వస్తుంది. 
 
అన్నింటికీ కేంద్రం నిధులే.. 
ఒక్కో బోరు వేసేందుకు అయ్యే ఖర్చు మొత్తం ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో సర్దుబాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మోటారుకు అయ్యే ఖర్చును స్పెషల్‌ డెవెలప్‌మెంట్‌ ఫండ్‌ ఖర్చు పెడుతున్నారు. ఇలా స్పెషల్‌ డెవెలప్‌ఫండ్‌ నిధులన్నింటినీ మళ్లించడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యుత్‌ లైన్లు, కనెక్షన్లకు అయ్యే ఖర్చులన్నింటినీ ఎస్పీడీసీఎల్‌ భరిస్తుంది. సాధారణంగా బోరు కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఏ రైతుకైనా ఎస్పీడీసీఎల్‌ రూ.49 వేల సబ్సిడీ ఇస్తుంది. అంతకన్నా ఎక్కువ అయ్యే ఖర్చును మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్‌ జలసిరిలో మాత్రం అదనంగా అయ్యే ఖర్చును జిల్లా నీటియాజమాన్య శాఖ భరిస్తుంది. అంటే జలసిరి కోసం ఒక్కపైసా ఖర్చు చేసిన దాఖలాలు లేవు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement