బ్యాంకుల వైఖరి మారితేనే ఔత్సాహిక వ్యాపారులకు లబ్ధి కలుగుతుందని సూక్ష్మ, చిన్న పరిశ్రమల అభివృద్ధి చైర్మన్ బీవీ రామారావు అన్నారు.
బ్యాంకుల వైఖరి మారాలి
Sep 22 2013 3:51 AM | Updated on Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్లైన్: బ్యాంకుల వైఖరి మారితేనే ఔత్సాహిక వ్యాపారులకు లబ్ధి కలుగుతుందని సూక్ష్మ, చిన్న పరిశ్రమల అభివృద్ధి చైర్మన్ బీవీ రామారావు అన్నారు. సూక్ష్మ, చిన్న వ్యాపారస్తుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజస్ స్కీం (సీజీటీఎంఎస్ఈ)ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏవిధమైన సెక్యూరిటీ థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఈ పథకం కింద రుణం పొందవచ్చునన్నారు.
దీని గురించి తెలియకపోవడం, తెలిసినా బ్యాంకులు సుముఖత చూపకపోవడంతో మనరాష్ట్రంలో చాలామంది ఉపయోగించుకోవడం లేదన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమిళనాడు,కర్నాటక రాష్ట్రాల్లో వేలాదిమంది వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పారు. భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు కూడా ధనవంతులకే రుణాలు మంజూరు చేస్తోందన్నారు. వ్యవసాయానికి ఇచ్చిన ప్రాముఖ్యత సూక్ష్మ, చిన్న వ్యాపారస్తులకు ఇవ్వవలసి ఉందన్నారు. ఇప్పటికైనా ఔత్సాహికులైన చిన్న, మధ్యతరహా వ్యాపారస్థులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి కో-ఆర్డినేటర్గా జి.వి.ఎస్.ప్రసాద్ను నియమించారని, వివరాలకు 98666 49369 నంబరును సంప్రదించాలని పేర్కొన్నారు.సమావేశంలో జి.వి.ఎస్.ప్రసాద్, పప్పల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement


