జర్నలిస్ట్‌పై కత్తులతో దాడి..

జర్నలిస్ట్‌పై కత్తులతో దాడి..


పాలకొల్లు: అధికార పార్టీ ఆగడాలను ఎండగడుతున్న ఓ జర్నలిస్ట్‌పై పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యాయత్నం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌ టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న రవిపై పాలకొల్లులో మంగళవారం అర్థరాత్రి కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా అధికారపార్టీ ఆగడాలను వెలుగులోకి తేవడంలో రవి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిపై దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతంలోనే రవిని ఓసారి అధికార పార్టీ నేతలు హెచ్చరించినట్లు సమాచారం.



రవిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం(ఏపీజేఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. రవిపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. జర్నలిస్టులపై ఈ తరహా దాడులు జరక్కుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. వార్తలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ప్రజాస్వామికంగా ప్రెస్ కౌన్సిల్ వంటి సంస్థలకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని, అలా కాకుండా జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడడం అప్రజాస్వామికం అని ఏపీజేఎఫ్ పేర్కొంది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా హోంమంత్రిత్వ శాఖ స్పందించాలని విజ్ఞప్తి చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top