రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) సమావేశం గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన జరగనుంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) సమావేశం గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో సుమారు రూ. 3 వేల కోట్లకుపైగా పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పలు పరిశ్రమలకు రాయితీలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉం దని పరిశ్రమల శాఖ వర్గాలు తెలి పాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద బ్రెజిల్కు చెందిన గెర్డావ్ కంపెనీ రూ. 1,500 కోట్లతో ఏర్పా టు చేసే స్టీల్ ప్లాంట్తో పాటు రూ. 300 కోట్లతో చిత్తూరులో కోల్గేట్ సంస్థ ఏర్పాటు చేసే యూనిట్కు ఇచ్చే రాయితీలపైనా నిర్ణయం తీసుకుంటారు.
మహబూబ్నగర్ జిల్లాలో రూ. 400 కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, కృష్ణా జిల్లాలో రూ. 160 కోట్లతో టెక్స్టైల్ యూనిట్ను విస్తరించనున్న మోహన్ స్పిన్టెక్స్తో పాటు ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద రూ. 800 కోట్లతో ఐటీసీ విస్తరణ ప్లాంటుకు ఇచ్చే రాయితీలపైన కూడా ఎస్ఐపీసీ చర్చించనుంది. ఈ యూనిట్ల ద్వారా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎస్ఐపీసీ భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరగనుంది.