బెల్లంపై తీపి ఆశలు | Anakapalli jaggery market picking up slowly | Sakshi
Sakshi News home page

బెల్లంపై తీపి ఆశలు

Oct 22 2013 1:47 AM | Updated on May 28 2018 4:20 PM

అనకాపల్లి మార్కెట్ కమిటీ అధికారుల సమ్మె విరమణతో లావాదేవీలపై ఆశలు చిగురిస్తున్నాయి.

 

=ఈ ఏడాది రూ.30 కోట్ల లావాదేవీలు
 =ఊపందుకోనున్న క్రయవిక్రయాలు

 
అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి మార్కెట్ కమిటీ అధికారుల సమ్మె విరమణతో లావాదేవీలపై ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం లావాదేవీలు బాగానే ఉన్నా, బెల్లం ధరలలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. రెండు నెలల పాటు మార్కెట్ కమిటీ అధికారులు విధులకు గైర్హాజరుతో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది బెల్లం బీట్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు.

ఈ సమయంలో బెల్లం క్రయవిక్రయాలలో ఆటంకాలు ఏర్పడనప్పటికీ ఉత్పత్తి చేసే రైతులు మాత్రం వెనుకంజ వేశారు. 2012-13లో మొదటి ఆరు నెలల లావాదేవీలు రూ.19.46 కోట్లు జరగ్గా 2013-14లో తొలి ఆరు నెలలు రూ.30.86 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 2011-12లో రూ.161 కోట్లు, 2012-13లో రూ.143.50 కోట్ల వ్యాపారం జరిగింది. రూ.17 కోట్ల లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో 2013-14 పై కూడా ఇదే తరహా ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశా యి.

కానీ 2013-14 మొదటి అర్థ సంవత్సర లావాదేవీలతో గత ఆర్థిక సంవత్సరాన్ని పోలిస్తే రూ.11 కోట్ల లావాదేవీలు అదనంగా జరిగినట్టు స్పష్టమవుతోంది. అంతేకాదు.. బెల్లం పరిమాణంలోనూ పు రోగతి కనిపిస్తోంది. ఈ ఆగస్టులో మాత్ర మే లావాదేవీలు తగ్గగా, సెప్టెంబర్‌లో కాసింత పెరుగుదల కనిపించింది.

ఆగస్టులో తగ్గుదల

గత ఏడాది ఆగస్టులో అనకాపల్లి మార్కెట్‌లో 2408 క్వింటాళ్ల లావాదేవీలతో 66 లక్షల 93 వేల 72 రూపాయల వ్యాపారం జరిగింది. 2013 ఆగస్టులో బెల్లం లావాదేవీలు 1207 క్వింటాళ్లకు పడిపోయి, 27 లక్షల 91 వేల 329 రూపాయలకు తగ్గింది. అక్టోబర్ తొలిపక్షంలోనూ నెమ్మదిగా లావాదేవీలు కొనసాగుతున్నాయి. సమ్మె విరమణ నేపథ్యంలో బెల్లం లావాదేవీలు ఊపందుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నా, ధరలు మాత్రం ఆశాజనకంగా లేవని రైతులు వాపోతున్నారు.

ఉదాహరణకు గత అక్టోబర్ 19న ఈ మార్కెట్‌లో 1715 బెల్లం దిమ్మలు క్రయవిక్రయాలు జరగ్గా, మొదటిరకం బెల్లం గరిష్టంగా 3480 రూపాయల ధర పలికింది. కాగా శనివారం అనకాపల్లి మార్కెట్‌కు 3512 బెల్లం దిమ్మలు రాగా, మొదటిరకం గరిష్టంగా 3410 రూపాయలు పలికింది.
 
అంటే బెల్లం ధర గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే 70 రూపాయలు తగ్గినట్లయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 8 లక్షల 17 వేల 958 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు జరగ్గా, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల 89 వేల 685 క్వింటాళ్లకు పడిపోవడంతో మార్కెట్ వర్గాలు డీలాపడ్డాయి. ఈ ఏడాది తొలి అర్థ భాగంలో లక్షా 24 వేల 102 క్వింటాళ్ల లావాదేవీలు జరగడంతో బెల్లం సరఫరా తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో జరిగే వ్యాపారంపైనే టర్నోవర్ ఆధారపడి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement