వంద మంది పోలీసులు, వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఒకవైపు. నలుగురు వార్డు సభ్యు లు, సర్పంచ్ మరో వైపు...
- అమీన్సాహెబ్ పాలెంలో పంచాయతీ సమావేశాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నాలు
- వైఎస్సార్ సీపీ సభ్యులను పోలీస్స్టేషన్కు తరలించిన ఎస్ఐ
- కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను దుర్భాషలాడిన దేశం నాయకులు
- మోహరించిన పోలీసులు....నాటకీయ పరిణామాల మధ్య నిరవధిక వాయిదా
- చివరిలో సర్పంచ్తోపాటు సభ్యులను ఓ గదిలో నిర్బంధించిన పోలీసులు
- వైఎస్సార్ సీపీ సర్పంచ్ చేస్తున్న పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్ర
నాదెండ్ల : వంద మంది పోలీసులు, వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఒకవైపు. నలుగురు వార్డు సభ్యు లు, సర్పంచ్ మరో వైపు. పోలీసులు టీడీపీ కార్యకర్తలు కలగలసి వైఎస్సార్సీపీ సర్పంచ్, వార్డు సభ్యులను భయభ్రాంతులకు గురిచేయటం చర్చనీయాంశంగా మారింది. నాదెండ్ల మండలం అమీన్సాహెబ్పాలెంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ పంచాయతీ సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే నిరవధికంగా 90 రోజుల పాటు వాయిదా పడింది..వివరాల్లోకి వెళితే..
మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామమైన అమీన్సాహెబ్పాలెం గ్రామ పంచాయతీ సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశారు. ముందుగానే 100 మంది పోలీసులు బందోబస్తుకు వచ్చారు. తొలుత 10 గంటల సమయంలో వైఎస్సార్ సీపీ ఉపసర్పంచ్ సత్తెనపల్లి శ్రీనివాసరావు, సభ్యులు తుపాకుల చెంచమ్మ, కారుచోల గోవిందమ్మ, కారుచోల రాజేశ్వరి హాజరయ్యారు. ఓ కేసులో నిందితుడిగా ఉండడంతో నిబంధనల మేరకు సర్పంచ్ కారుచోల చంద్రయ్య పోలీసులు అనుమతితో సమావేశానికి రావాల్సివుంది. ఈలోపు పంచాయతీ కార్యాలయానికి హాజరైన వైఎస్సార్ సీపీ నలుగురు సభ్యులను ఎస్ఐ సుబ్బానాయుడు తమ అనుమతి లేకుండా ఎందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తూ వారిని తమ జీపులో ఎక్కించుకొని రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ మీడియా ప్రశ్నించటంతో సర్పంచ్, వార్డు సభ్యులను కలిపి సమావేశానికి తీసుకువెళుతున్నట్టు చెప్పారు.
ఓటింగ్ సరిసమానం..
10.40 గంటలకు సర్పంచ్ కారుచోల చంద్రయ్య అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ప్రత్యేక అధికారిగా ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ హాజరయ్యారు. అజెండాలోని అంశాలను కార్యదర్శి కల్యాణి చదివి వినిపించగా, కొద్దిసేపటికి ఓటింగ్ జరిగింది. వైఎస్సార్ సీపీ సభ్యురాలు షేక్ ఆదమ్మను సమావేశానికి రానివ్వకుండా చేయడంతో మొత్తం 10 మంది సభ్యులకు 9 మంది హాజరయ్యారు. ఓటింగ్లో టీడీపీ సభ్యులు ఐదుగురు, వైఎస్సార్ సీపీ సభ్యులు నలుగురు పాల్గొన్నారు. సర్పంచ్ ఓటుతో సరిసమానమైంది. దీంతో ప్రత్యేకఅధికారి చంద్రశేఖర్ ఓటింగ్ సమానంగా ఉందని తీర్మానాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేపడతామని చెప్పి సమావేశాన్ని 11.40 గంటలకు ముగించారు.
సమావేశం ముగిసినా ...తప్పని వివాదం ....
సమావేశం ముగిసిన అనంతరం సర్పంచ్ చంద్రయ్య, వైఎస్సార్సీపీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రూరల్ సీఐ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని గదిలో నిర్బంధించారు. నాటకీయ పరిణామాల మధ్య 12.10 గంటలకు అప్పటివరకు రానివైఎస్సార్ సీపీ సభ్యురాలు ఆదమ్మను రప్పించి సమావేశం తిరిగి నిర్వహించి, తీర్మానంపై ఓటింగ్ పెట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఓ దశలో అధికారులపై టీడీపీ నాయకులు దుర్భాష లాడటంతో చేసేది లేక ఆదమ్మ 12.10 గంటలకు హాజరైనట్లు తీర్మానం పుస్తకంలో రాసి సంతకం చేయించారు. అయినా తిరిగి సమావేశం నిర్వహించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ నాయకుల ఒత్తిడితో 90 రోజుల వరకు సమావేశం వాయిదా వేస్తున్నట్టు ప్రత్యేక అధికారి ప్రకటించేలా చేశారు.
పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ నాయకులు
చివరకు సర్పంచ్ చంద్రయ్యతోపాటు వైఎస్సార్సీపీ సభ్యులను పోలీసులు తమ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. అనంతరం టీడీపీ నాయకులు గ్రామపంచాయతీ కార్యాలయంలోకి ప్రవేశించి రెండు వైపులా ఉన్న తలుపులు మూయించి అధికారులను నానా విధాలుగా దుర్భాషలాడారు. బయటకు వచ్చిన ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ చంద్రయ్య, వార్డు సభ్యులను భయపెట్టడానికి సీఐ దిలీప్కుమార్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారని పలువురు ఆరోపించారు.
పనులు జరగకుండా అడ్డుకోవటమే లక్ష్యం ....
పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 10 లక్షలు కేటాయించింది. సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు జరగకూడదన్న దురుద్దేశంతోనే సమావేశాన్ని వాయిదా వేయించారని వైఎస్సార్సీపీ సర్పంచ్, సభ్యులు ఆరోపిస్తున్నారు. మంత్రి అండదండలతో స్థానిక నాయకులు అడుగడుగునా అడ్డుతగులుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.