తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాల బీడు భూముల్లో హరిత సిరులు పండించాలనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి రూ.40,300 కోట్ల వ్యయంతో చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాల బీడు భూముల్లో హరిత సిరులు పండించాలనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి రూ.40,300 కోట్ల వ్యయంతో చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తద్వారా జిల్లాలోని 14 మండలాల్లోని 286 గ్రామాల పరిధిలోని 2.46 లక్షల (29 టీఎంసీల) ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రణాళిక రూపొందించారు.
ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జాతీయ హోదా దేవుడెరుగు నిధుల కేటాయింపులోనూ అన్యాయమే జరుగుతోంది. జిల్లాకు జీవనాధారంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు 2012-13 బడ్జెట్లో రూ.1,100 కోట్లు కేటాయించగా.. 2013-14 బడ్జెట్లో కేవలం రూ.1,395 కోట్లతో సరిపెట్టింది. తాజాగా ఈసారి రూ.1,051 కోట్లను బడ్జెట్లో పొందుపరిచింది.
‘ప్రాంతీయ రింగ్రోడ్డు’ ప్రస్తావన
‘ప్రాంతీయ రింగ్రోడ్డు’ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి ఆనం.. నిధుల కేటాయింపు ఊసెత్తలేదు. ‘మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రణాళిక -2031’లో నోటిఫై చేసిన ఈ రోడ్డును ప్రస్తావించిన ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరంలో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 90 మీటర్ల వెడల్పుతో 287 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదించిన ఈ రింగ్రోడ్డు పది ప్రధాన నగర కేంద్రాలనూ, 13 మండలాలను కలుపుతూ నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఔటర్రింగ్రోడ్డు ఆవల ఈ రోడ్డును ప్రతిపాదించారు.
‘ఐటీ’ఐఆర్ గొప్పలు
ఇటీవల కేంద్ర మంత్రి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్)తో హైదరాబాద్ ఐటీ హబ్గా మారనుందని ఆనం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 202 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐటీఐఆర్ను అభివృద్ధి కానుంది. దీంతో రూ.2.19 ల క్షల కోట్లు ఐటీ రంగ మదుపుల అవకాశంతోనూ, అలాగే 2.35 కోట్లు ఐటీ సేవల ఎగుమతుల రూపంలో.. ఐటీఐఆర్ ప్రాజెక్టు, ప్రత్యక్షంగా రూ.3.11 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, 53 లక్షల మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుందని ఆనం పేర్కొన్నారు.