పథకం ప్రకారమే పేలుళ్లు! | According to the scheme of explosions! | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే పేలుళ్లు!

Sep 18 2014 1:39 AM | Updated on Apr 3 2019 4:08 PM

పథకం ప్రకారమే పేలుళ్లు! - Sakshi

పథకం ప్రకారమే పేలుళ్లు!

దిల్‌సుఖ్ నగర్‌లో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18గా

దిల్‌సుఖ్‌నగర్ ఘటనలో మృతులు 18 మంది!
మృతుల్లో గర్భిణి ఉండటంతో పెరిగిన  సంఖ్య
గర్భస్థ శిశువు మరణాన్నీ పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఐఏ
జంట పేలుళ్ల కేసుకు సంబంధించి రెండో చార్జ్‌షీట్ దాఖలు
రియాజ్ భత్కల్ సహా ముగ్గురిపై అభియోగాలు

 
హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్‌లో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18గా పరిగణిస్తూ ఎన్‌ఐఏ తన తాజా చార్జిషీటును దాఖలు చేసింది. వాస్తవానికి ఈ ఘటనలో 17 మంది మృతులయ్యారు. 131 మంది గాయపడ్డారు. అయితే మృతులైన వారిలో ఓ గర్భిణి కూడా ఉండడం, ఆమె గర్భంలోని శిశువూ మృతిచెందడాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ దర్యాప్తు సంస్థ సీఆర్‌పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)లోని  వెసులుబాటు వినియోగించుకొని మృతుల సంఖ్యను 18గా ధ్రువీకరించింది. ఈ మేరకు నాంపల్లిలోని న్యాయస్థానంలో బుధవారం దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. పేలుళ్లను నిందితులు పక్కా ప్రణాళికతో చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ నిగ్గుతేల్చింది.

మరో ముగ్గురిపైనా అభియోగాలు

ఈ కేసులో ఇప్పటికే యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీలపై తొలి చార్జ్‌షీట్ వేసింది. దీనికి అదనంగా మరో ముగ్గురు రియాజ్ భత్కల్, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్, తెహసీన్ అక్తర్ అలియాస్ తబ్రేజ్‌లపై తాజా చార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపింది. ఈ ముగ్గురినీ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతేడాది అరెస్టు చేయగా... ఈ ఏడాది మేలో ఎన్‌ఐఏ అధికారులు  హైదరాబాద్ తీసుకువచ్చి విచారించారు. పాకిస్థాన్‌లో తలదాచుకున్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ సూత్రధారిగా,  బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేసిన ఐఎం ఆపరేషనల్ చీఫ్ యాసిన్ భత్కల్ పేలుళ్లకు వ్యూహరచన చేసినట్లు ఎన్‌ఐఏ నిర్ధారించింది. పాకిస్థాన్ నుంచే రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి తొలి వారంలో హడ్డీకి నగదు, పేలుడు పదార్థాలను కర్ణాటకలోని మంగుళూరులో అందించాడని పేర్కొంది. అక్కడి హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థ ఔట్‌లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మంగుళూరులోని మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం చేసే డింగ్ డాంగ్ దుకాణం యజమాని నుంచి హడ్డీ నగదు అందుకున్నాడని తేల్చింది. మంగుళూరులోనే ఉన్న యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ట్రాలీ బ్యాగ్‌లో ఉన్న 25 కేజీల అమ్మోనియం నైట్రేట్, 30 డిటోనేటర్లను కూడా తీసుకున్నట్లు, వాటితో పేలుళ్లు జరపడానికి 16 రోజుల ముందే  హైదరాబాద్ చేరుకున్నట్లు వెల్లడించింది.

వఖాస్, తెహసీన్ అక్తర్ వచ్చిన తరవాత అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గదుల్లోనే గతేడాది ఫిబ్రవరి 21న బాంబులు తయారు చేసి అదే రోజు సైకిళ్లకు అమర్చి దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో పేల్చారని తేల్చింది. వీరు సమాచార మార్పిడి కోసం  నింబస్, యాహూ, పాల్‌టాక్, జీమెయిల్, ఫేస్‌బుక్‌ల ద్వారా చాటింగ్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి వినియోగించిన ఐడీలను కూడా కనుగొన్నారు. రియాజ్ భత్కల్ (ఞ్చ్ట్చట్చటజీజజిఃడ్చజిౌౌ. ఛిౌఝ), యాసీన్ భత్కల్ (ౌఠ్ఛిట్చఝ361ఃడ్చజిౌౌ.ఛిౌఝ), తెహసీన్ (జిజీజిౌ్ఛడ93ఃడ్చజిౌౌ.ఛిౌఝ), అసదుల్లా (జిౌఠీఠీటఠఛ్ఛ్చీటఃడ్చజిౌౌ.ఛిౌఝ) తరహాలో సృష్టించారని అధికారులు తేల్చారు. దిల్‌సుఖ్‌నగర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తు తం పరారీలో ఉన్న రియాజ్ భత్కల్ అరెస్టుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌ఐఏ ప్రకటిం చింది. మరోపక్క తెహసీన్ అక్తర్, వఖాస్ సహా మరికొందరిపై రాజస్థాన్ యాంటీ టైరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు శుక్రవారం అక్క డి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement