ఈ విద్యా సంవత్సరం రాష్ట్రానికి 450 మెడికల్ సీట్లు అదనంగా వచ్చాయని వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్ : ఈ విద్యా సంవత్సరం రాష్ట్రానికి 450 మెడికల్ సీట్లు అదనంగా వచ్చాయని వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అదనంగా కేటాయించిన సీట్లలో తిరుపతి స్విమ్స్కు 150 సీట్లు మంజూరు అయినట్లు కామినేని వెల్లడించారు. మిగిలిన 300 సీట్లను ప్రయివేట్ కళాశాలలకు కేటాయించినట్లు చెప్పారు. ఎంసీఐ రద్దు చేసిన 350 సీట్లను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కామనేని శ్రీనివాస్ తెలిపారు.
ఎంసీఐని మళ్లీ రాష్ట్రంలో తనిఖీలు చేయమని కోరతామని మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి ఆ సీట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందని అన్నారు. మెడికల్ కళాశాలల్లో ఫీజు విధానాన్ని ఈరోజు సాయంత్రం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీని ఎలా కొనసాగించాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.