చదువు గురించి ఇంట్లో తరచూ మందలిస్తుండటంతో మనస్తాపం చెందిన ముగ్గురు బాలికలు విమానంలో గోవా పారిపోవాలనుకున్నారు.
శంషాబాద్, న్యూస్లైన్: చదువు గురించి ఇంట్లో తరచూ మందలిస్తుండటంతో మనస్తాపం చెందిన ముగ్గురు బాలికలు విమానంలో గోవా పారిపోవాలనుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిక్కడపల్లి గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్న వేర్వేరు కుటుంబాలకు చెందిన సోను(13), ప్రీతి(14), కీర్తన (14) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్నారు. సరిగ్గా చదవడం లేదంటూ తల్లిదండ్రులు మందలిస్తుండడంతో వీరు ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు.
మంగళవారం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పని ఉందని ఇళ్లలో చెప్పిన వీరు ముగ్గురూ నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి పది గంటలప్పుడు టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి గోవా వెళ్లడానికి టికెట్లు ఇవ్వాలని అడిగారు. బాలికల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఎయిర్లైన్స్ సిబ్బంది వారిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. బాలికలను ప్రశ్నించిన ఆర్జీఐఏ పోలీసులు.. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. దీంతో అర్ధరాత్రి సమయానికి విమానాశ్రయానికి చేరుకున్న తల్లిదండ్రులకు బాలికలను అప్పగించడంతో వారు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు.