సమైక్యాంధ్ర పరిరక్షణకు రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా, ప్రణాళికబద్ధంగా నిర్వహించనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి తెలిపారు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా, ప్రణాళికబద్ధంగా నిర్వహించనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి తెలిపారు. ఈనెల 30న కర్నూలులో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభను 29వ తేదీనే నిర్వహించాలని రాష్ట్రస్థాయి సమైక్య జేఏసీ నిర్ణయించిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 29న టీఆర్ఎస్, తెలంగాణ ఉద్యోగ సంఘాలు హైదరాబాద్లో సదస్సును నిర్వహించనున్నాయని, వాటికి దీటుగా కర్నూలులో అదే రోజు సమైక్య రాష్ట్ర పరిరక్షణ సదస్సు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
సమైక్య రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 24న జిల్లా బంద్ చేపడతామన్నారు. 19, 20 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను దిగ్బంధిస్తామని.. 21న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు లైట్లు ఆర్పి నిరసన తెలుపనున్నట్లు వివరించారు. 22, 23 తేదీల్లో సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అవగాహన సదస్సులు ఏర్పాటవుతాయన్నారు. 25, 26 తేదీల్లో ప్రైవేటు వాహనాల బంద్.. 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ చేపడతామని తెలిపారు.