మెడలోని దండ.. ఆయనకు వేసి అవమానించింది!

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. గంగానదిలో మూడురోజులపాటు బోటులో ప్రయాణించి.. ప్రచారం నిర్వహించిన ఆమె.. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో యాత్ర ముగించారు. ఈ సందర్భంగా ఆమె తన మెడలోని ఓ పూలదండను తీసి.. అక్కడే ఉన్న దివంగత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విగ్రహం మెడలో వేశారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన బీజేపీ.. ప్రియాంక తన మెడలోని హరాన్ని శాస్త్రి విగ్రహానికి వేసి.. ఆయనను అవమానించారంటూ.. విమర్శల దాడికి దిగింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. ప్రియాంకపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వినియోగించిన పూలహారాన్ని శాస్త్రి విగ్రహానికి వేసి.. ప్రియాంక ఆయనను అవమానించారని, ఆమె అహంకారానికి ఇది నిదర్శనమని స్మృతి మండిపడ్డారు. బీజేపీ శ్రేణులు కూడా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. తూర్పు యూపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ప్రజలతో మమేకమయ్యేందుకు, వారితో మాట్లాడేందుకు గంగానదిలో చేపట్టిన బోటు యాత్ర.. బుధవారం ముగిసిన సంగతి తెలిసిందే. 
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top