పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు | Sakshi
Sakshi News home page

పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు

Published Fri, Sep 20 2013 7:19 AM

వైఎస్ కుటుంబంపై విషంగక్కేలా దారుణ వ్యాఖ్యలు చేస్తూ... మళ్లీ దానికి ‘సీబీఐ చార్జిషీట్’ అనే రంగు పులిమారు. అయినా సీబీఐ కోర్టుకిచ్చిన పత్రాలు ఈనాడు చేతికెలా వచ్చాయి? అవిభక్త కవలల్లాంటి రామోజీ-చంద్రబాబులు సీబీఐతో కుమ్మక్కయిన ఫలితమా ఇది? నిత్యం ఉషోదయంతోపాటే జగన్ నామ జపం చేయనిదే పొరపాటున కూడా పొద్దు గడవని ‘ఈనాడు’.. వైఎస్సార్‌సీపీ అధినేతపై షరామామూలుగానే మళ్లీ విషం కక్కింది. ఈసారి మరింతగా దిగజారిపోయింది. ఆ క్రమంలో నైచ్యానికే నయా అర్థం చెప్పింది. ‘సీబీఐ వేసిన చార్జిషీట్’ అంటూ గురువారం పతాక శీర్షికల్లో అది వండి వార్చిన కథనాన్ని చూస్తే గోబెల్స్ కూడా గుండెలు బాదుకోవాల్సిందే! ఇంకా బయటికి వెల్లడేకాని, న్యాయమూర్తి విచారణకైనా స్వీకరించని, నిందితుడికి కాపీ కూడా ఇవ్వని చార్జిషీట్‌లోని వివరాలు ఇవేనంటూ శివాలెత్తిపోయి రామోజీ రాసిన రోత రాతలపై.. బరితెగించడానికైనా, దిగజారిపోవటానికైనా ఒక హద్దుంటుంది అరాచకానికైనా, నైచ్యానికైనా పరాకాష్టంటూ ఒకటుంటుంది కానీ రామోజీరావు, ఆయన విషపుత్రిక ‘ఈనాడు’ వాటన్నిటినీ ఎప్పుడో దాటేశారు!. న్యాయస్థానాల్లో ప్రమాణం చేసి మరీ అవలీలగా అబద్ధాలాడేస్తారు రామోజీ! బంధువుల్ని కూడా వదలకుండా నమ్మినవారిని నిలువునా వంచిస్తారు రామోజీ! ఫోర్జరీ, చీటింగ్ కేసులు ఎదుర్కొంటున్నా... పన్ను కట్టలేదన్న కేసులు పెండింగ్‌లో ఉన్నా... ‘మార్గదర్శి’ పునాదులే అక్రమమని చెప్పే కేసులు న్యాయస్థానాల్లో నడుస్తున్నా... కనీస విలువలు పాటించాలన్న జ్ఞానం ఆయనకు రాకపోవటమే దారుణం. సీబీఐ వేసిన ‘చార్జిషీట్’ అంటూ గురువారం పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అసలు ఏ దర్యాప్తు సంస్థయినా కోర్టుకు చార్జిషీటు సమర్పిస్తే ఆ చార్జిషీటును తొలుత న్యాయమూర్తి విచారణకు స్వీకరించాలి. అప్పుడే అది బహిరంగమవుతుంది. పెపైచ్చు నిందితుడికి కాపీ ఇస్తారు. కానీ రెండు రోజుల కిందట వేసిన చార్జిషీట్‌ను ఇంకా జడ్జి విచారణకు స్వీకరించనేలేదు. నిందితుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికీ దాని కాపీ అందలేదు. కానీ ఇంతలోనే రామోజీ శివాలెత్తేశారు. జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు పిటిషన్‌పై న్యాయస్థానం తీర్పు వెలువరించనుండటంతో... ‘దాన్ని ప్రభావితం చేయడానికా?’ అనే రీతిలో అడ్డగోలు రాతలు రాసేశారు. వైఎస్ కుటుంబంపై విషం గక్కేలా దారుణ వ్యాఖ్యలు చేస్తూ... మళ్లీ దానికి ‘సీబీఐ చార్జిషీట్’ అనే రంగు పులిమారు. అయినా సీబీఐ కోర్టుకిచ్చిన పత్రాలు ఈనాడు చేతికెలా వచ్చాయి? అవిభక్త కవలల్లాంటి రామోజీ-చంద్రబాబులు సీబీఐతో కుమ్మక్కయిన ఫలితమా ఇది? బాబుపై దర్యాప్తుకు చేతులు రావు! దర్యాప్తు సంస్థతో రామోజీ-చంద్రబాబు కలయిక ప్రభావాన్ని ఇప్పటికే ఈ రాష్ట్రం ప్రత్యక్షంగా చూసింది. చంద్రబాబు, రామోజీల అక్రమాలపై విచారణ జరపండంటూ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులిచ్చినా సరే... సీబీఐ మాత్రం వాళ్ల జోలికే వెళ్లలేదు. ఆఖరికి ఈ మిత్రద్వయం సుప్రీంకోర్టుకు వెళ్లి, అక్కడా కాదన్నాక మళ్లీ హైకోర్టుకు వచ్చి... కేసు రెండు మూడు బెంచిలు మారేలా నాటకమాడేదాకా సీబీఐ కదిలితే ఒట్టు! చివరకు హైకోర్టులో జస్టిస్ రోహిణి నేతృత్వంలోని బెంచ్... అంతకుముందు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయటంతో ఆ దర్యాప్తు ఆగిపోయింది. దానికన్నా ముందు ఐఎంజీ కేసులోనూ ఇంతే. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే... ఇదే సీబీఐ తనకు తగినంత సిబ్బంది లేరనే సాకుతో బాబును వదిలిపెట్టేసింది!! అదే సీబీఐ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయానికొచ్చేసరికి మాత్రం ఎక్కడలేని సత్తువనూ కూడగట్టుకుని ‘నభూతో...’ అన్న రీతిలో రెచ్చిపోయింది. 29 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ... ఇళ్లు, ఆఫీసులు, ఇన్వెస్టర్ల కార్యాలయాలు అన్నిటిపై ఏకకాలంలో దాడులు చేసి మరీ... 14 రోజుల్లోనే కోర్టుకు నివేదిక సమర్పించింది. బాబు-రామోజీ ద్వయం సీబీఐతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు ఇవన్నీ బలం చేకూర్చేవే కాదా? బాబు దొరికినా వదిలేశారందుకే!! బాబు అడ్డంగా దొరికింది ఐఎంజీ కేసులో మాత్రమే కాదు... ఎమ్మార్, రాంకీ కేసుల్లో కూడా. ఎందుకంటే శ్రీమంతుల గోల్ఫ్ కోర్సుకు ప్రభుత్వ భూమి ఇవ్వాలన్న ఆలోచన బాబుదే. 200 ఎకరాలివ్వాలనుకున్నా... అది చాలదని దాన్ని 435 ఎకరాలకు పెంచిందీ బాబే. ఎమ్మార్‌కు టెండరు దక్కేలా చక్రం తిప్పటమే కాక... అంత భూమినీ పప్పుబెల్లాలకు కట్టబెట్టేసిందీ ఈ బాబే. అన్ని చేసినా ఎమ్మార్‌పై దర్యాప్తులో మాత్రం బాబును వదిలేసింది దర్యాప్తు సంస్థ. అదేమని కోర్టు అడిగితే... 2004 కన్నా ముందు జరిగిన దాన్ని తాము దర్యాప్తు చేయటం లేదని కూడా చెప్పింది!! ఏమనుకోవాలి ఈ బంధాన్ని? రాంకీ సంస్థకు విశాఖ ఫార్మా సిటీలో 2,142 ఎకరాలను సింగిల్ టెండర్‌పై కట్టబెట్టింది కూడా బాబే. కానీ ఈ అంశంపై దర్యాప్తు చేసినపుడు... గ్రీన్‌బెల్ట్ పెంచుతామని ప్రతిపాదించి పెంచనందుకు వైఎస్ ప్రభుత్వాన్నే సీబీఐ తప్పుబట్టింది తప్ప... 2,142 ఎకరాల్ని సింగిల్ టెండర్‌పై ఎలా కట్టబెట్టారని బాబును అడిగితే ఒట్టు! బాబుకెందుకు ఈ నజరానాలు? రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లుకు పరోక్షంగా మద్దతిచ్చినందుకా? రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను గాలికొదిలేసినందుకా? రూ.32,000 కోట్ల కరెంటు భారం మోపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిన దెబ్బకు మండిపడుతూ ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్‌ను కాపాడినందుకా? బెయిల్ అనగానే ఢిల్లీకెందుకో? కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తారు? చనిపోయిన నాయకుడిపై... అది కూడా మరణించిన ఏడాదిన్నర తరవాత... అది కూడా ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాక... ఇద్దరూ కుమ్మక్కయి కేసులు వేయటం నిజం కాదా? చట్టప్రకారం 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే సాకుతో అడ్డుకోవటం అబద్ధమా? అయినా జగన్ బెయిల్ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చినా చంద్రబాబు ఢిల్లీకెందుకు వెళతారు? తన మనుషుల్నెందుకు పంపిస్తారు? ఏదో ఒక సంచలనాన్ని సృష్టిస్తూ... దాన్ని ఎల్లో మీడియా ద్వారా తాటికాయలంత అక్షరాలతో ఏదో జరిగిపోయినట్టుగా రాయించటం... న్యాయస్థానాల్ని ప్రభావితం చేసే రీతిలోనే ఆ రాతలుండటం... ఇవన్నీ ఎందుకు? ఏం! జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలొస్తుందంటే బాబుకు అంత భయమెందుకు? రామోజీకి అంత ఉలుకెందుకు? జగన్ జనం గుండెల్లో ఉన్న నేత కనుక ఆయన బయటికొస్తే తమ చిరునామాలు గల్లంతౌతాయనా? కొనగలవా రామోజీ? ఇక్కడ రామోజీ గమనించాల్సిందేంటంటే... వైఎస్ రాజశేఖరరెడ్డి గనక నిజంగా తన కుమారుడికి మేలు చేయాలనుకుంటే ఎల్ అండ్ టీకి బాబు కట్టబెట్టినట్లుగా హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా ఏ రూ.4 వేలకో ఇస్తారు గానీ... ఇలా ప్రైవేటు భూములను ఎకరా రూ.3 లక్షలు పై చిలుకు పెట్టి కొనుక్కునేలా ఎందుకు చేస్తారు? నిజం చెప్పాలంటే ప్రభుత్వ భూముల్లో ఉంటేనే మైనింగ్ లీజులకు విలువ. ఎందుకంటే కారుచౌకగా కట్టబెట్టే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటు భూముల్లోనైతే కొనుగోలుదారే డిమాండ్‌కు తగ్గ ధర చెల్లించి మరీ కొనాలి. రామోజీ గనక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే అలాంటి భూములు చాలానే ఉంటాయి. అయినా సున్నపురాయి నిక్షేపాలు సిమెంట్ కంపెనీకి కాక దేనికైనా పనికొస్తాయా? సిమెంట్ కంపెనీకి వాటిని లీజుకిస్తే తప్పేంటి? అంబుజా ఎందుకు ఫ్యాక్టరీ పెట్టలేదు? గుజరాత్ అంబుజా కంపెనీ 2000 నుంచి 2005 వరకూ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టలేదన్న విషయం రామోజీ రాతల్లో కనిపిస్తుంది. దాన్ని ఏమాత్రం ప్రశ్నించని రామోజీ.. అలా చేయనందుకే ఆ లీజును జగన్‌కుఇచ్చారని. జగన్ మూడేళ్లలో ఫ్యాక్టరీ కట్టి చూపించారని మాత్రం చెప్పరు. ఎందుకంటే తన ‘పాలసీ’ పుట్టలో అది పట్టదు మరి! మరీ ఇంత దారుణమా రాజ గురివిందా!! ఈరోజు భారతి సిమెంట్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల పైచిలుకు మందికి ఉద్యోగాలు కల్పిస్తోందిగా! గుజరాత్ అంబుజా అక్కడ ప్లాంటు పెట్టని నేపథ్యంలో, జగన్ కూడా ముందుకు రాకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవా? కడప జిల్లాలో ‘భారతి’ వచ్చేదాకా పాతికేళ్లుగా ఒక్క సిమెంట్ కంపెనీ అయినా వచ్చిందా? అయినా ప్రైవేటు భూమిని కొనుక్కుని కంపెనీ పెడితే ప్రభుత్వానికి పన్నులు, ఇతర సుంకాల వల్ల భారీ ఆదాయమే తప్ప నష్టమెలా వస్తుంది? ఇదేమీ ఫిల్మ్ సిటీ మాదిరిగా పేద రైతుల్ని బెదిరించి, ప్రభుత్వ యంత్రాంగం సాయంతో కబ్జాలు చేసి సాధించుకున్న భూమి కాదు కదా! ఇప్పటికీ ఫిల్మ్ సిటీ భూముల్ని పోగొట్టుకుని వేదన అనుభవిస్తున్న రైతులు రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టూ కోకొల్లలు. కానీ భారతి సిమెంట్ వల్ల నష్టపోయామనే వారిని ఒక్కరినైనా చూపించగలరా రామోజీ? మరెందుకీ దగుల్బాజీ రాతలు? ఈ మాత్రం ఇంగితం లేదా? జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. సోమవారం తీర్పు రానుంది. దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పింది కనక ఇక బెయిల్‌కు అడ్డు ఉండకపోవచ్చన్నది న్యాయ వర్గాలు సైతం చెబుతున్న మాట. ఈ తరుణంలో ఇంకా ఎవరికీ అందని చార్జిషీటు సమాచారం ఎల్లో బ్రదర్స్ పత్రికల్లోనే ఎలా వచ్చింది? పోనీ ఆ చార్జిషీట్లోని సమాచారాన్ని యథాతథంగా ప్రచురిస్తారా అంటే అదీ లేదు. నాణేనికి ఒకవైపును మాత్రమే చూపిస్తూ... దానికి తమ తిక్క కామెంట్లు జోడిస్తూ నోటికొచ్చినట్టుగా వండి వార్చేస్తారు రామోజీ!! తీర్పుకు ముందు ఇంతటి భ్రష్టుపట్టిన రాతలు రాశారంటే రామోజీకి దురుద్దేశాలు లేవని నమ్మేదెవరు? ఇరికించాలన్నదే మీ లక్ష్యమా? కేసు లేకపోయినా... తప్పు జరగకపోయినా... ప్రతి విషయంలోనూ ఏదో జరిగిపోయినట్టుగా రాసి అందరినీ ప్రభావితం చేయాలన్న దురుద్దేశంతో ఎల్లో కూటమి దిగజారి చేస్తున్న యుద్ధమిది. అందుకే ఇండియా సిమెంట్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం నీళ్లివ్వటం రామోజీ దృష్టిలో గానీ, సీబీఐ దృష్టిలో గానీ తప్పు కాదు. అదే కంపెనీకి, అవే నీళ్లను రెన్యువల్ చేస్తూ వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు!! అయినా నీళ్లు, కరెంటు ఇవ్వకపోతే కంపెనీలొస్తాయా? కంపెనీలు లేకుంటే ఉద్యోగాలొస్తాయా? పెన్నా సిమెంట్స్ అధిపతి తన సొంత భూమిలో హోటల్ కట్టుకుంటానంటే... మిగతా హోటళ్లలానే దానికి అనుమతి ఇస్తే... అది వైఎస్ ప్రభుత్వం ఇచ్చింది కనక తప్పేననే రీతిలో సాగిన దర్యాప్తు కాదూ ఇది!!?. దర్యాప్తు అధికారి నేరుగా మీడియాకు ఐదారు వందల ఫోన్ కాల్స్ చేసి... వైఎస్ కుటుంబంపై బురద చల్లటమే లక్ష్యంగా చేసిన దర్యాప్తు కాదూ ఇది? దాన్ని భూతద్దంలో చూపిస్తూ... వక్రీకరించి పతాక కథనాలు వండుతూ అటు ఎల్లో మీడియా... దానికి మద్దతుగా అపవిత్ర పొత్తులతో చెలరేగుతున్న ఎల్లో పార్టీ... ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రం విభజన పేరిట రావణ కాష్టంలా మారినా దాంట్లోనే చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి భ్రష్టుపట్టిన వ్యవస్థల రాతల్ని ఈ రాష్ట్ర ప్రజలే తిరగరాస్తారు. సాయిరెడ్డి ఆ సమావేశాల్లో ఉన్నారా? భారతి సిమెంట్‌కు ఒక్క ఓబీసీ మాత్రమే రుణమిచ్చినట్టు... అది కూడా విజయసాయిరెడ్డి వల్లే వచ్చినట్టు ఎందుకీ కుట్రపూరిత రాతలు? ఆ సంస్థకు ఆరేడు బ్యాంకులు రుణాలిచ్చాయి. వాటిలో ఓబీసీ ఒకటి. మరి వాటన్నిటినీ సాయిరెడ్డి మేనేజ్ చెయ్యగలరా? అయినా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు బ్యాంకు బోర్డు ముందుకు వచ్చినప్పుడు సాయిరెడ్డి తనంత తనే సమావేశాల నుంచి బయటికెళ్లిపోయారు. అవన్నీ రికార్డులు చూస్తే తెలుస్తాయి. మరి దానర్థం కంపెనీ ప్రమోటర్లతో తనకున్న సంబంధాలు చెప్పినట్టు కాదా? అయినా బ్యాంకులు రుణాలిస్తే తప్పా? జగన్ తను వ్యక్తిగత గ్యారంటీ ఇవ్వటంతో పాటు షేర్లు కూడా తనఖా పెట్టారు. అంతేకాక ఆ రుణాన్ని అణా పైసల్తో సహా సకాలంలో చెల్లించారు. ఇందులో తప్పేముంది? అప్పటికే ఒక కంపెనీని విజయవంతంగా నడుపుతున్న జగన్‌కు బ్యాంకులు రుణాలిస్తే తప్పా? ఏం... మీలా చిత్తు కాగితాలు, పాత సీరియళ్ల పేటెంట్ హక్కుల్ని తనఖా పెట్టి వేల కోట్లు రుణం తీసుకోకపోవటమే తప్పా? ముఖ్యమంత్రి ఇంట్లో సంతకాలు జరగటమూ తప్పేనా? దానర్థం అప్పట్లో జగన్ ఇక్కడ లేరనేగా! బెంగళూరులో ఉండే జగన్‌మోహన్‌రెడ్డి నెలకు ఒకటిరెండు రోజులు ఇక్కడకు వస్తే... ఆ రెండు మూడ్రోజులు తన తల్లిదండ్రులతో ఉంటే అది తప్పా? బ్యాంకు అధికారులు బెంగళూరుకు ఖర్చులు పెట్టుకుని వచ్చే బదులు... ఇక్కడే సంతకాలు తీసుకుంటే అది అక్రమమా? కొన్ని సంతకాలు బెంగళూరులో కూడా పెట్టినా ఆ విషయం మాత్రం ఎందుకు రాయరు? ఎందుకీ కుట్రలు? న్యాయమూర్తి నివేదికా పట్టదా? రాష్ట్ర ప్రభుత్వం గనక ఈ భూ కేటాయింపులో తప్పు చేసి ఉంటే ట్రిబ్యునల్‌లో గుజరాత్ అంబుజా వాదనలు వినిపించింది కదా! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వటం రామోజీకి తెలియదా! ఆ తరవాత హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ రాజు నేతృత్వంలో కమిషన్ వేయడం.. ఆయన నివేదికనిస్తూ దీన్లో ఏ తప్పూ జరగలేదని చెప్పడం... ఇవేవీ రామోజీకి పట్టవా? ఒకవేళ పట్టినా, ‘కళ్లు మూసుకుని అబద్ధాలు చెబితే చాలు, ఎవరినైనా తప్పుదోవ పట్టించొచ్చు’ అన్న కుయుక్తా!? లీజు గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? మైనింగ్ లీజుల గురించి మాట్లాడుతున్న రామోజీకి... అసలు లీజు అనే పదాన్ని పలికే నైతిక అర్హత ఉందా? హైదరాబాద్ నుంచి విశాఖపట్నం దాకా ఎక్కడ చూసినా రామోజీది గ‘లీజు’ చరిత్రేగా!! హైదరాబాద్‌లో లీజుకు తీసుకున్న భూమిని ఖాళీ చేయనంటూ భీష్మించుకుంటే చివరికి రాజకీయ జోక్యంతో స్థల యజమాని సెటిల్ చేసుకోవటం అబద్ధమా? అదే యజమానికి చెందిన విశాఖ స్థలాన్ని లీజు గడువు ముగిసినా ఇంకా ఖాళీ చెయ్యలేదు రామోజీ. అంతేగాక దాన్ని తన సొంత స్థలమని చెప్పి... కొంత భాగం ప్రభుత్వానికిచ్చి, పరిహారంగా ఇచ్చిన భూమిని తనే భోంచేసిన చరిత్ర ఆయనది. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి చీటింగ్, ఫోర్జరీ వంటి ఇతర నేరాలకు పాల్పడ్డారనే కేసులూ నమోదయ్యాయి. ఇక విశాఖలో డాల్ఫిన్ హోటల్ కోసం లీజుకిచ్చిన వారిని బెదిరించి మరీ కారుచౌకగా కొట్టేసిన ఘనుడాయన. విజయవాడలో సొంత బంధువుల స్థలాన్ని లీజుకు తీసుకుని, గడువు ముగిసినా తిరిగివ్వకుండా న్యాయ పోరాటానికి దిగిన ఘనుడు కూడా! ఇలాంటి వ్యక్తికి ఎదుటివారు ఏం చేసినా అది అక్రమంగానే కనిపించటంలో చిత్రమేముంది? ఫిల్మ్ సిటీ భూముల మాటేంటి? నగరానికి అత్యంత సమీపంలో 2,500 ఎకరాలకు పైగా స్థలాన్ని... పేద రైతుల పొట్టగొట్టి, బెదిరింపులకు పాల్పడి మరీ ఫిల్మ్ సిటీ కోసం సొంతం చేసుకున్న రామోజీకి... ఇతరులు ఏం చేసినా అన్యాయంగా కనిపించటం ఆశ్చర్యం అనిపించదు. ఎకరాకు రూ.10-15 వేలు విదిలించి, పేద రైతుల్ని బెదిరించి మరీ భూముల్ని స్వాధీనం చేసుకున్న రామోజీకి భూముల క్రయ విక్రయాలన్నీ అక్రమాలుగానే కనిపించొచ్చు. ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, అసైన్డ్ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ఆఖరికి భూ దాన భూముల్ని కూడా భోంచేసిన రామోజీకి ప్రైవేటు వ్యక్తులకు భారీ ధర చెల్లించి కొనుక్కోవటం కూడా నేరమనే అనిపించొచ్చు. రామోజీ కట్టాల్సిన పన్ను 1,117 కోట్లు! ఇతరులపై బురద జల్లటానికి చెలరేగిపోయే రామోజీకి... తన ఒంటికున్న మకిలి కనిపించకపోవటమే విచిత్రం. ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట అక్రమంగా డిపాజిట్లు తీసుకున్నందుకు ఆయనపై భారీగా ఐటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీని ప్రకారం 2001-02 నుంచి 2005-06 మధ్య ఆయన రూ.1,117 కోట్ల పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారు. దీన్ని చెల్లించాలని ఐటీ నోటీసులివ్వడంతో రామోజీ కోర్టుకు వెళ్లారు. తనకు నోటీసులిచ్చిన అధికారికి దురుద్దేశాలు ఆపాదించటంతో కోర్టు కోపగించింది. రామోజీపై జరిమానా వేసింది. దాంతో జరిమానా చెల్లించి పిటిషన్లు విత్ డ్రా చేసుకున్నారు. అయినా మళ్లీ కొత్త పిటిషన్లు వేసి.. ఐటీ పేర్కొన్న చట్టాలేవీ తనకు వర్తించవన్నారు. హైకోర్టులో ఇది పెండింగ్‌లో ఉంది. కాకపోతే దీన్ని వెకేట్ చేయించడానికి 2009 నుంచి ఇప్పటిదాకా ఐటీ శాఖ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఏటా కనీసం రూ.120 కోట్ల మేరకు వడ్డీ నష్టపోతున్నా ఐటీ శాఖ ఎందుకు మిన్నకుందనేది ఎవరికీ అర్థం కాదు!