హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్రలో సమైక్యవాదుల ఆందోళన ఉధృత రూపం దాల్చుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌనం వీడారు. సంయమనం పాటించాలని సీమాంధ్ర ప్రజలను కోరారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలని డిజీపీ, జిల్లా కలెక్టర్లను, ఎస్పిలను ఆదేశించారు. బుల్లెట్లు వాడకుండా ఆందోళనకారులను నియత్రించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆస్తులకు నష్టం జరుగకుండా అడ్డుకోవాలన్నారు. ఆందోళనకారులు జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేయవద్దని కోరారు. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో రెండోరోజు కూడా నిరసనలు వెల్లువెత్తాయి. సీమాంధ్ర జిల్లాల్లో ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. కాగా తన హయాంలో రాష్ట్రం విడిపోవడంపై మనస్తాపం చెందిన ముఖ్యమంత్రి రాజీనామా లేఖను పార్టీ అధినేత్రికి అందించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే దానిని సోనియాగాంధీ కూడా అక్కడే తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎం తన రాజీనామా వార్తలను ఖండించారు కూడా. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన రాజీనామాలపై తొందరపడవద్దంటూ సీమాంధ్ర నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.