కడప సిటీ : కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలమైన ప్రపంచస్థాయి వసతులను అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రజత్ కుమార్ సైని తెలిపారు. శనివారం కడప సమీపంలోని కొప్పర్తి ఎన్ఐసీడీసీ పారిశ్రామిక ప్రాంతాన్ని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ డాక్టర్ నిధిమీనా, సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావనలతో కలిసి పరిశీలించారు. పారిశ్రామికవాడ ప్రాంతంలో జరుగుతున్న మౌలిక వసతుల పనుల పరిశీలించిన అనంతరం గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. వివిధ పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులోని అన్ని పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కొప్పర్తి పారిశ్రామిక కేంద్రం ద్వారా సుమారు రూ.8,860 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండగా, దాదాపు 54,500 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేలా చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్ సైని అధికారులకు సూచించారు. కడప ఆర్డీవో మురళి, ఏపీఐఐసి డిప్యూటీ జెడ్ఎం కమలాకర్, పరిశ్రమల శాఖ అధికారులు, వివిధ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పీఎం శ్రీ పాఠశాలల్లో
మౌలిక సదుపాయాల పరిశీలన
కడప ఎడ్యుకేషన్: ఒంటిమిట్టలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేంద్రీయ విద్యాలయ సంఘట న్ పాఠశాల, వల్లూరులోని ఏపీ మోడల్ స్కూళ్లలో పీఎం శ్రీ పథకం కింద అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులను ఎన్ఐిసీడీసీ సీఈఓ అండ్ ఎండీ కేంద్ర పరిశీలకులు రజత్ కుమార్ షైనీ, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శనివారం తనిఖీ చేశారు. ఈ పరిశీలనలో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలు, కిచెన్ గార్డెన్, సైన్స్ – కంప్యూటర్ ల్యాబ్లు, ఆట స్థలం), సోలార్ పవర్ వ్యవస్థ, సీసీ కెమెరాల నిర్వహణతో పాటు పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన సుమారు 21 రకాల మౌలిక వసతులను వారు తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి, వారి అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. పీఎం శ్రీ పాఠశాలల లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఈఎంఏటి డైరెక్టర్ ప్రసన్న కుమార్, లెక్చరర్లు ప్రసాద్ రావు, శ్రీ సురేష్ కుమార్, పుల్లట రమేష్, ఆర్జేడీ శ్యామ్యూల్, డీఈఓ షంషుద్దీన్, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు.


