తిండి గింజల కోసమని...
తిండిగింజల కోసమని బోరు కింద 40 సెంట్లలో వరిపంటను సాగు చేసుకున్నా. ప్రస్తుతం వస్తున్న కేసీ నీటితో వరినాటుకున్నా. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. వర్షాల రాకుండా ఎండల తీవ్రత పెరిగితే మాత్రం కష్టాలు తప్పవు.
– చిరంజీవిరెడ్డి, రైతు, కొత్తపల్లె, మైదుకూరు
కడప అగ్రికల్చర్: ఎల్నినో ప్రభావానికి అధికారుల నిర్లక్ష్యం తోడై సాగునీటితో పాటు గుక్కెడు తాగునీటికీ కష్టమొచ్చింది. ఖరీప్ సీజనంతా చినుకు జాడ లేక పొలమంతా బోసిపోయింది. చివరికి కేసీ ఆయకట్టు రైతుల్లోనూ పంట సాగుకు ధైర్యం కరువైంది. ఈ నేపథ్యంలో తాగునీరుతోపాటు వినాయక నిమజ్జనం కోసమని అధికారులు కేసీ కాలువకి కాసింత నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నీటిని నమ్ముకుని కేసీ కెనాల్ కింద బోర్లు ఉండి నీటి ఆధారం గల రైతులు వరి సాగుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీడు భూములకు నీటి తడులను అందించి దమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా వరినాట్లకు ముందు భూమి దమ్ము కోసం నీరు ఎక్కువ అవసరం. ఖరీఫ్ సీజన్లో దమ్ము చేసుకోవడానికీ రైతులు అంతగా సాహసించలేకపోయారు. కాగా ప్రస్తుతం వస్తున్న నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమేననే అధికారులు చెబుతున్నారు.
వర్షాభావ పరిస్థితులు కొనసాగినా... కేసీకి నీరు ఆగినా ప్రస్తుతం సాగవుతున్న‘వరి’కి కష్టకాలమే.
‘తిండిగింజలైనా పండించుకుంటే..
జీవనం గడుస్తుందనే ఆశతో వరి వేస్తున్నా’మంటున్న రైతుకు గడ్డుకాలమే.
కేసీ కెనాల్లో ప్రవహిస్తున్న నీరు


