బ్రహ్మంగారిమఠం : మండలంలోని తోట్లపల్లె దగ్గర ఉన్న అచలానంద ఆశ్రమంలో సోమవారం రాత్రి నిరుపేద కుటుంబానికి చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి కార్తీక్(13) విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు జి.శివకుమార్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి నిరుపేద విద్యార్థులు దాదాపు 23 మంది ఇక్కడ ఉంటూ బి.మఠంలో చదువుకుంటున్నారని తెలిపారు. ఆశ్రమం వారు ఏర్పాటు చేయడం మంచిదే అయితే అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అన్నారు. కార్తీక్ అనే పిల్లవాడు ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన కత్తి ఆంజనేయులు, వీరమ్మ దంపతుల రెండవ కుమారుడు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఆశ్రమంలో వదిలారు. కార్తీక్ ఆశ్రమం సమీపంలో ఉన్న బోరింగ్ దగ్గరకు స్నానానికి వెళ్లాడు. అక్కడే వేలాడుతున్న కరెంట్ వైర్లు చూడక పోవడంతో టవల్ పైకి వేసుకొనే సమయంలో కరెంట్ తగిలి షాక్ కొట్టగానే అక్కడే పడిపోయినట్లు తెలుస్తోంది. ఆశ్రమ నిర్వాహకులు పలు మార్లు విద్యుత్ ఏఈకి వైర్లు మార్చాలని తెలిపినా పట్టించుకోలేదు. కావున విద్యార్థి మరణానికి ముఖ్య కారకులు విద్యుత్ అధికారులు అన్నారు. విద్యుత్శాఖ, ఆశ్రమ నిర్వాహకులు విద్యార్థి కుటుంబానికి రూ. 50 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకుడు జి.శివకుమార్ కోరారు. కరెంట్ ఏఈని సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థి మృతి వార్త తెలియగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆశ్రమానికి చేరుకున్నారు. బి.మఠం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బద్వేల్కు తరలించారు. విద్యార్థి మృతదేహాన్ని సీపీఐ, ఎస్ఎఫ్ఐ, వివిధ గ్రామాలకు చెందిన పలువురు సందర్శించి, నివాళులర్పించారు.


