ఖాజీపేట : ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే మావిగన్పై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధపడాలని, అప్పుడే ప్రజల అభిప్రాయం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. దుంపలగట్టు గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అతి తక్కువ ఖర్చుతో రాజధాని వేగంగా అభివృద్ధి చెందేందుకు మాజీ సీఎం జగన్ చేసిన ప్రతిపాదన చాలా ముఖ్యమైదని అన్నారు. రాష్ట్ర ప్రజల, మేధావుల అభిప్రాయం తెలుసుకోకుండానే ప్రభుత్వం మావిగన్పై విమర్శలు చేయడం తగదని అన్నారు. తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ సీఎం చేస్తారని అన్నారు. అలాగే మావిగన్ పై కూడా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే వాస్తవ విషయాలు కూటమి ప్రభుత్వానికి తెలుస్తాయని అన్నారు. ఇటీవల ఏబీఎన్ రాధాకృష్ణ మాజీ సీఎం జగన్ చెబితే వైఎస్సార్సీపీ నాయకులు కట్టుకున్న భార్యలను వదిలి చెల్లిగా భావిస్తారని పెళ్లి సంబంధాలు కూడా చూస్తారని, తమ పార్టీ నేతలను వెన్నుముక లేని బ్యాచ్గా వివర్శలు చేశారని అన్నారు. ఇలాంటి మాటలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. బూతులు మాట్లాడే ఏబీఎన్ రాధాకృష్ణకు మహిళలే తగిన విధంగా గుణపాఠం చెబుతారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని నీచ భాషలో తిట్టి.. నేడు 2024లో పొత్తు పెట్టుకుని పోటీ చేశారని అన్నారు. నేడు రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందని విమర్శించారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నా లేకున్నా 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న నాయకుడని అన్నారు. ఆయనపై ఎంత విషం చిమ్మి, తప్పుడు విమర్శలు చేసినా ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన అన్నారు.


